అవకాశం చిక్కినప్పుడల్లా తన పవర్ ఏంటో చూపిస్తూ, ప్రత్యర్థులకు దడ పుట్టించే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా, పవన్ ఏ మాత్రం వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నారు.
ఏపీలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా, తెలంగాణలోనూ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అలాగే కేంద్ర అధికార పార్టీ బీజేపీ అండదండలు ఉండడంతో, ఆ పార్టీ మద్దతుతో మరింతగా బలోపేతం కావాలని చూస్తున్నారు.
ఇప్పటికే ఉమ్మడిగా అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టేందుకు పవన్ ప్రణాళిక వేసుకునే పనిలో ఉన్నారు.అయితే కేంద్ర బీజేపీ పెద్దలు వైసీపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, పవన్ ఒకింత బీజేపీపై ఆగ్రహంగానే ఉన్నట్టు కనిపించినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగడంతో పాటు, కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.ఇదిలా ఉంటే ఏపీ తెలంగాణలో ఆకస్మాత్తుగా ముంచెత్తిన వరదల కారణంగా, జనజీవనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
దీనిపై ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను పవన్ ప్రశ్నిస్తూ, ప్రజల తరపున అనేక డిమాండ్లు ఆయన చేస్తూ వస్తున్నారు.అలాగే కోటి రూపాయలు విరాళం కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి పవన్ ఇచ్చారు.
తాజాగా ఏపీ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో జనసేన బృందాలు ప్రస్తుతం పర్యటిస్తున్నాయి.
ఉభయగోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో వరద కారణంగా ఏర్పడిన నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నాయి.ఈ జిల్లాలో పర్యటించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇది ఇలా ఉంటే హైదరాబాదులో కూడా నష్టాన్ని అంచనా వేసి ఒక నివేదికను రూపొందించే విధంగా పవన్ ఏర్పాటు చేశారు.
ఈ రెండు రాష్ట్రాల్లో జనసేన బృందాలు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పూర్తిగా పరిశీలించి, నివేదికను తీసుకుని ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలవాలని నిర్ణయించుకున్నారు.అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయ్యేందుకు పవన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ నివేదికలు అందడం, అక్కడ అపాయింట్మెంట్ ఖరారు కాగానే ఢిల్లీకి వెళ్తారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.పనిలో పనిగా కేంద్ర బీజేపీ పెద్దల దగ్గర జనసేన రాజకీయ భవిష్యత్తు పై పవన్ పూర్తిస్థాయిలో చర్చించి, ఒక ప్రణాళిక తో రాజకీయంగా ముందడుగు వేయాలని పవన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.