వరుస వరుసగా పోరాటాలు చేస్తూ కాక పుట్టిస్తూ హడావుడి సృష్టిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సరికొత్త తరహా పోరాటం చేసేందుకు నడుం బిగించాడు.తెలుగు భాషను , నదులను పరిరక్షించుకోవడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
మన నుడి – మన నది పేరుతో ఏపీలో జనసేన ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు.
మన భవితకు ప్రాణాధారమైన మాతృభాషను మనం కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుతామని పవన్ కళ్యాణ్ అన్నారు.
‘నాగరికతకు పుట్టినిల్లు నది.నది లేనిదే సంస్కృతి లేదు.నది నశించాక ఆ సంస్కృతి మిగలదు.దీనికి చరిత్రలో కావలసినన్ని రుజువులు ఉన్నాయి అంటూ పవన్ వెల్లడించారు.నాగరికతకు అమ్మ ఒడి నుడి.భాష లేనిదే సంస్కృతి లేదు.
మాతృభాష గతించాక సంస్కృతి మిగలదు.మన మనుగడకు జీవనాధారమైన నదులను మనం చేతులారా విషమయం చేస్తున్నాం.
మన భవితకు ప్రాణాధారమైన అమ్మనుడికి మనం అతివేగంగా దూరమవుతున్నాం.మాతృభాష మూలాలను మనమే నరికేసుకుంటున్నాం.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.‘మన నుడి మన నది’ కార్యక్రమానికి సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పవన్ తెలిపారు.