కేంద్ర అధికార పార్టీ బీజేపీపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతున్నట్టుగా కనిపిస్తోంది.దేశ సంపదను మొత్తం అంబానీ , ఆదానీ లకు కట్టబెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు జనాల్లోకి వెళ్ళిపోయాయి.
గతంతో పోలిస్తే ప్రధాని మోదీ గ్రాఫ్ బాగా తగినట్లుగానే లెక్కలు బయటకు వస్తున్నాయి.ప్రస్తుతం విశాఖ కు తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం మొగ్గు చూపించడం, దీనికి అనుకూలంగా కసరత్తు చేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మరో సారి బయటకు వచ్చింది.విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం బాట పట్టాయి.
ఇక ఈ విషయంలో ఏపీ రాజకీయ పార్టీలు వెనక్కి ముందుకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.
ఏపీ అధికార పార్టీ వైసీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ విషయంలో మొదట మౌనంగానే ఉన్నట్లుగా కనిపించినా, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉద్యమ బాట పట్టింది.
నేడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర సైతం నిర్వహిస్తున్నారు.ఇక తెలుగుదేశం పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ ప్రభుత్వం పైన నిందలు వేస్తూ , కేంద్రంపై సుతిమెత్తగా విమర్శలు చేస్తోంది.
ఇక ఈ విషయంలో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఏపీ బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు డైలమాలో పడి పోయారు.
ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని అడ్డుకునేందుకు కేంద్ర బీజేపీ పెద్దలతో ఈ విషయమై చర్చించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి మరి కేంద్ర బీజేపీ పెద్దలతో మంతనాలు చేసినప్పటికీ, ప్రయోజనం లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు.మొదట్లో బిజెపి నేతలు ఈ విషయంలో సైలెంట్ గానే ఉన్నా, వారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగిపోవడంతో, కేంద్ర బీజేపీ పెద్దల నిర్ణయమే తమ నిర్ణయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారుల.కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల మరింతగా అభివృద్ధి చెందుతుందని మాట్లాడారు.
అలాగే బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సైతం ప్రైవేటీకరణ కు అనుకూలంగా మాట్లాడడం వంటి వ్యవహారాలపై ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.దీనిపై విశాఖ ఉక్కు కార్మికులు సైతం బీజేపీ నాయకుల పై మండిపడుతున్నారు.
ఇక జనసేన విశాఖ నేతలకు ఈ విషయంలో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి నెలకొనడంతో, మీడియాకు దూరంగా ఉంటున్నట్టు గా కనిపిస్తున్నారు.తాజాగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి సైతం జనసేన రాకపోవడంతో, ఇక ఆ పార్టీ స్టీల్ ప్లాంట్ విషయంలో చేతులెత్తేసినట్లే అన్న అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది.
ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గేలా కనిపించకపోవడంతో, ఏపీ బిజెపి నాయకులతో పాటు జనసేన నాయకులు సందిగ్దంలో పడ్డారు.ఈ విషయంలో రాజకీయంగానూ , మరోవైపు కార్మికులు ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడితోనూ ఎక్కడ లేని హైరానా పడుతున్నారు.
ఇప్పటి వరకు ఏపీలో కాస్తో కూస్తో బలం పుంజుకుంటున్నట్లుగా ఉన్న ఏపీ బీజేపీ నేతలకు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన నాయకులకు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ముందరి కాళ్ళకు బంధంలా మారింది.