ఏపీలో జనసేన, బిజెపి కలిసి ముందుకు వెళ్లి బలం పెంచుకుని అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాయి.దీనికోసం ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకుని ఏకాభిప్రాయంతో ఏపీలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ మేరకు ఒక కమిటీని గతంలో ఏర్పాటు చేసుకున్నారు.ఆ కమిటీ ద్వారా రెండు పార్టీలు సమన్వయంతో వ్యవహరిస్తూ, ఏ విషయం అయినా ఏకాభిప్రాయంతో ఉండాలని గతంలో నిర్ణయించుకున్నారు.
కానీ అమరావతి విషయంలో మాత్రం ఈ రెండు పార్టీలు విభిన్న వైఖరితో వెళుతుండటం, ఒకరికి ఒకరు సంబంధం లేదన్నట్లుగా ఉండటం వంటి చర్యలతో జనసేన బిజెపి పొత్తులపై అనుమానాలు మొదలయ్యాయి.ముఖ్యంగా జనసేన పార్టీ ఏపీ రాజధాని అమరావతినే కొనసాగించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తూనే వస్తోంది.
దీని కోసం గతంలో పవన్ గట్టిగా ఆదోళన నిర్వహించారు.
రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల తరుపున పవన్ నిలబడ్డారు.
అసలు మూడు రాజధానుల ప్రతిపాదన అంగీకరించేది లేదని, ప్రభుత్వం మూడు రాజధానులు అంటే కుదరదని అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.బిజెపి మాత్రం మూడు రాజధానులకు మద్దతు పలికింది.
అసలు రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని, తాము జోక్యం చేసుకోమని, పూర్తిగా ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అంటూ పరోక్షంగా జగన్ నిర్ణయానికి, మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు పలికింది.ఇదిలా ఉంటే తాజా జనసేన పార్టీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో మూడు రాజధానుల ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని, అమరావతినే రాజధాని చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని లిఖితపూర్వకంగా కోర్టుకు తెలియజేసింది.
గతం లో అమరావతి వ్యవహారంపై కోర్టు అన్ని పార్టీలకు నోటీసులు ఇచ్చి, అన్ని పార్టీల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరిన నేపథ్యంలో పవన్ ఈ విధంగా స్పందించారు.కానీ బిజెపి జనసేన పార్టీలు వేరు వేరుగా అమరావతి వ్యవహారంలో స్పందించడం, ఒకరితో ఒకరు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతుండటం, ఇవన్నీ రెండు పార్టీల మధ్య ఉన్న పొత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.