ఇద్దరూ ఇద్దరే ఎవరూ తగ్గరు అంతే అన్నట్లుగా ఉంది జనసేన బీజేపీ మధ్య పొత్తు వ్యవహారం.కేంద్ర అధికార పార్టీ గా తామే గొప్ప అన్నట్లుగా బిజెపి జనసేన విషయంలో వ్యవహరిస్తోంది.
ఏపీలో పాగా వేయాలని బిజెపి ఎప్పటి నుంచో కలలు కంటోంది.కానీ ఆ కలలు తీరే మార్గం కనిపించడం లేదు.
గతంలో టిడిపితో పొత్తు పెట్టుకునే సమయంలో బిజెపి తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నించినా, టిడిపి ఆ ప్రయత్నాలను అడ్డుకుంటూ వచ్చింది.ఇక ఆ పార్టీతో పొత్తు తెగతెంపులు అయిన తర్వాత జనసేన పార్టీ తో బీజేపీ పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తోంది.
ప్రస్తుతం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.ఈ ఎన్నికలలో పోటీ చేయాలని మొదటి నుంచి బిజెపి ఆశలు పెట్టుకుంది.
అందుకే జనసేనతో తమకు ఇబ్బంది లేకుండా, ముందుగానే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతిలో జనసేన మద్దతు బీజేపీ అభ్యర్థి పోటీ లో ఉంటాడు అంటూ ప్రకటించి జనసేన ఆగ్రహానికి గురయ్యారు.అయితే ఎక్కడా జనసేన ఆ ఆగ్రహాన్ని బయటకు వెళ్లగక్కకుండా ఢిల్లీకి వెళ్లి ఈ విషయంపై క్లారిటీ తెచ్చుకునేందుకు అప్పట్లోనే ప్రయత్నాలు చేశారు.
అయినా ఢిల్లీ నుంచి ఏ విధమైన సానుకూలత రాలేదు.దీంతో బీజేపీ వ్యవహారాన్ని పక్కనపెట్టి, ఏపీలో తామే సొంతంగా బలపడాలనే దృక్పథంతో జనసేన పార్టీ ఉంటూ వస్తోంది.
కానీ అవేమి వర్కౌట్ కాలేదు.అయినా బీజేపీ, జనసేనను బుజ్జగిస్తూనే వస్తోంది.
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలలో వచ్చిన ఊపుతో జనసేన పార్టీ తిరుపతి లో పోటీ చేయాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.ఈ విషయంలో బీజేపీతో విబేధించేందుకు, అవసరమైతే పొత్తు రద్దు చేసుకునేందుకు సైతం జనసేన వెనకాడనట్టుగా కనిపిస్తోంది.జనసేన వ్యవహారం ఇలా ఉంటే, బిజెపి మాత్రం ఖచ్చితంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి లో బీజేపీ జెండా ఎగరాలి అని, జనసేన సహకారం తీసుకుని ఇక్కడ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని పోటీకి దింపి గెలవాలనే పట్టుదలతో ఉంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఈ విషయంలో ఏదో రకంగా ఒప్పించగలము అనే నమ్మకాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో జనసేనకి ఎక్కువ బలం ఉందనే విషయాన్ని బీజేపీ ముందు ప్రదర్శించేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తున్నా, బిజెపి మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
ఈ రెండు పార్టీల మధ్య ఈ విషయంలో లెక్క తేలడం లేదు.
ఇదిలా ఉంట మార్చి 4వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రాబోతున్నారు.దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తిరుపతిలో ఆయన సమావేశం నిర్వహించనున్నారు.
ఆ తరువాత మార్చి 5వ తేదీన బిజెపి రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు.ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికపై విస్తృత స్థాయిలో చర్చ జరుగబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడే అమిత్ షా కీలకమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.అవసరమైతే ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఆహ్వానించి, ఆయన సమక్షంలో ని తిరుపతి లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారనే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
అయితే పవన్ ఈ విషయంలో బీజేపీ అగ్రనేతలు ఒత్తిడికి తెల్గుతారో, లేక బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకుని జనసేన అభ్యర్థి పోటీలో ఉంటాడు అనే బహిరంగంగా ప్రకటన చేస్తారో చూడాలి.