‘స్థానిక’ సంస్థల ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి.రాష్ట్ర రాజకీయాలు వేరు, గ్రామ రాజకీయాలు వేరు వేరు కావడంతో ‘స్థానిక’ పరిస్థితులకు అనుగుణంగా నాయకులు వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమం లో రాష్ట్ర నాయకత్వం ఆలోచన ఎలా ఉన్నా గ్రామ స్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా నిజాయకవర్గాల ఇంచార్జీలే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం ఏపీలో స్థానికి సంస్థల ఎన్నికల హడావుడి ఎక్కువగా ఉంది.
ఒకవైపు అధికార వైసీపీ దూకుడు ఎక్కువగా ఉండడంతో పాటు తమకు పరాభవం తప్పదు అనే ఆందోళనలో మిగతా రాజకీయ పార్టీలు ఉన్నాయి.ప్రస్తుతం జనసేన బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ మేరకు విజయవాడలో కీలక సమావేశం కూడా నిర్వహించుకున్నారు.అయితే ఈ పొత్తులతో తమకు ఏ సంబంధం లేదు అన్నట్టుగా జనసేన టీడీపీ నాయకులు పొత్తులు పెట్టుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
జనసేన పార్టీకి బలం ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో నియోజకవర్గ స్థాయిలో టిడిపి నాయకులు, జనసేన నాయకులు కలిసి ఒక ఒప్పందానికి వస్తున్నారు.ముమ్మిడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జి దాట్ల బుచ్చి బాబు, జనసేన పార్టీ ఇంచార్జి పితాని బాలకృష్ణ ఈ మేరకు సర్దుబాట్లు కూడా చేసుకున్నారు.13 ఎంపీటీసీ, ఒక జెడ్పిటిసి స్థానాన్ని ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అంగీకారం తెలిపింది.నియోజకవర్గ స్థాయి నాయకులు ఇంకా అనేక ప్రాంతాల్లో టిడిపి, జనసేన పొత్తులు పెట్టుకున్నాయి.
రాష్ట్ర స్థాయిలో జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, అది పెద్దగా వర్కౌట్ అవ్వదు అనే ఆలోచనతో జనసేన నాయకులు టిడిపి తో సంప్రదింపులు, సీట్ల సర్దుబాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బిజెపి బలంగా ఉన్న గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు, జనసేన బలంగా ఉన్న చోట జనసేన అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు.
మిగతా చోట్ల టిడిపి, జనసేన కలిసి పొత్తు పెట్టుకుంటున్నాయి.అయితే ఈ వ్యవహారంపై పార్టీ అగ్రనేతలకు సమాచారం ఉందో లేదో తెలియదు కానీ, ఇప్పుడు ఈ విధంగా గ్రామస్థాయిలో రాజకీయాలు చోటుచేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
జనసేన స్థానిక నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై బిజెపి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.