స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఏపీలో మొదలైపోయింది.నువ్వా, నేనా అన్నట్లు గా అన్ని పార్టీలు గెలుపు కోసం పోటా పోటీ పడుతున్నాయి.
ఈ స్థానిక పోరులో మెజార్టీ స్థానాలను దక్కించుకుని ప్రజల్లో తమ ప్రభుత్వానికి ఏ విధంగా మద్దతు ఉందో నిరూపించుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది.అలాగే ప్రతిపక్ష టిడిపి కూడా స్థానిక వైసీపీ కంటే ఎక్కువ స్థానాలను సాధించి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని హైలెట్ చేయాలని ప్రయత్నిస్తోంది.
ఆ దిశగా ప్రధాన పార్టీలు గా ఉన్న వైసిపి టిడిపి పోటాపోటీ పడుతుండగా, బిజెపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.కేంద్ర బిజెపి పెద్దలను కలిసి ఇదే విషయమై మాట్లాడడానికి పవన్ ఢిల్లీ వెళ్లారు.
స్థానిక ఎన్నికలలో జనసేన బిజెపి కలిసి పోటీ చేస్తారని ఇప్పటికే రెండు పార్టీలు పిలుపునిచ్చాయి.దీనిపై పార్టీ శ్రేణుల్లోనూ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీలో చేసుకున్న ఒప్పందానికి, గ్రామస్థాయిలో తిరిగే మాకు చాలా తేడా ఉంటుందని, ఇది గ్రహించకుండా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ముందుకు నడవాలి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ జనసేన నాయకులు తమ అధినేత తీరును తప్పుబడుతున్నారు.గ్రామ స్థాయిలో రాజకీయాలు వేరేగా ఉంటాయి అని, వేరే పార్టీకి ఓటు వేయమని చెప్పినా పెద్దగా పట్టించుకోరు అని వారు చెబుతుండగా, బిజెపి కార్యకర్తలు కూడా ఇదేవిధంగా స్పందిస్తున్నారు.
గత ఎన్నికల్లో కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచిన జనసేన తో కలిసి ఎలా పోటీ చేస్తాయని, గతంలో ఈ విధమైన పొత్తు కారణంగానే ఏపీలో బీజేపీ ఎదగలేకపోయింది అని, ఇప్పుడు మళ్లీ అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదు అంటూ వారు చెబుతున్నారు.ఇలా గ్రామస్థాయి రాజకీయాల విషయంలో రెండు పార్టీల కార్యకర్తల అభిప్రాయాలు ఇలా ఉండగా, బిజెపి అగ్రనేతలు జనసేన అధినేత పవన్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు పార్టీల పొత్తు ద్వారా అత్యధిక సీట్లు సాధించాలని చూస్తున్నాయి.వాస్తవంగా చెప్పుకుంటే ఈ రెండు పార్టీలకు క్షేత్రస్థాయిలో అంతగా బలం లేదనే చెప్పాలి.మరి స్థానిక పోరులో ఈ రెండు పార్టీలు ఏ విధంగా నెట్టుకోస్తయో చూడాలి.