ఏపీ రాజకీయాలలో అమరావతి రాజధాని అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.అమరావతిని కేవలం లెజిస్లేటివ్ రాజధానిగా మాత్రమే ఉంచి పరిపాలనా రాజధానిగా విశాఖని, లీగల్ రాజధానిగా కర్నూల్ ని అధికార పార్టీ కన్ఫర్మ్ చేసేసింది.
అయితే ఈ విషయంలో అధికార పార్టీతో విపక్షాలన్నీ విభేధిస్తున్నాయి.మరో వైపు రాజధాని గ్రామాల రైతులు కూడా గత నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు.
అసలు అమరావతి రాజధానిగా ఉంచాలని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అధికార పార్టీ ఎ మాత్రం లెక్కచేయకుండా తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి రెడీ అయ్యింది.ఇదిలా ఉంటే అమరావతిని రాజధానిగా ఉంచాలని విపక్షాలు ఎవరికీ వారుగా పోరాటం చేస్తున్నారు.
టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఒక దారిలో వెళ్తే, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకొని ఉమ్మడి పోరాటానికి సిద్ధమైంది.
ఇదిలా ఉంటే ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలని కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తరువాత బీజేపీ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో రెండు పార్టీలు అమరావతి రాజధాని పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.ఇందులో భాగంగా ఫిబ్రవరి 2న అమరావతి నుంచి విజయవాడ వరకు బీజేపీ-జనసేన పార్టీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున లాంగ్ మార్చ్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు.
ఈ విషయాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.ఈ లాంగ్ మార్చ్ ద్వారా అమరావతి ఉద్యమాన్ని మరింత ముందుకి తీసుకెళ్తామని తెలిపారు.ఇప్పటికే విశాఖలో ఇసుక సమస్యపై జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ నేపధ్యంలో రాజధానిపై చేపట్టే ఈ లాంగ్ మార్చ్ కూడా అంతకు రెట్టింపు సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.
అయితే దీనికి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడే అవకాశం ఉందనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.