ఏపీలో ప్రధాన పార్టీలుగా టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ఉన్నాయి.ఈ రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోరు కొనసాగుతోంది.
ఇంకా కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు ఉన్నా వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది.అయితే ఇప్పుడు కొత్తగా జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళబోతున్న పరిస్థితుల్లో మూడో ప్రత్యామ్న్యాయ కూటమికి ఆదరణ ఉంటుందా అనేది ప్రశ్నగా మారింది.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను గతం నుంచి పరిశీలిస్తే ఇక్కడ రెండే పక్షాలు ప్రధానంగా పోటీ పాడడం, ఏదో ఒక పక్షానికి ప్రజలు మద్దతు పూర్తిగా ఉంటూ వారికే అధికారం కట్టబెట్టడం జరిగిపోతూ వస్తోంది.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ నుంచి పరిశీలించినా ఏపీ రాజకీయాల్లో మూడో కూటమిని జనం ఆదరించలేదు.
బిజెపి కి ఎపి లో ఎదిగే అవకాశం లభిస్తున్న సమయంలో టిడిపి ఆవిర్భావం ఆ పార్టీ ఆశలపై పూర్తిగా నీళ్ళు చల్లేసింది.
ఇక ఇప్పుడు జనసేన పార్టీ ద్వారా ఏపీలో బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ ఆశపడుతోంది.అయితే బీజేపీ ఆశలు ఎంతవరకు తీరుతాయో అనేది ప్రశ్నగా మారింది.ఏపీ రాజకీయాలను పూర్తిగా పరిశీలిస్తే ఇక్కడ ప్రధానంగా కమ్మ, రెడ్డి మధ్యే రాజకీయం అనేది ఎప్పుడూ ఉంటూ వస్తోంది.
బలమైన కాపు సామాజిక వర్గంతో తృతీయ ప్రత్యామ్నాయం సాధ్యమే అని అప్పట్లో ప్రజారాజ్యం పార్టీతో మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.అయితే ఆయన అనుకున్నది ఒకటి ప్రజాక్షేత్రంలో జరిగింది మరొకటి అయ్యింది.
ప్రజారాజ్యానికి కేవలం 18 స్థానాలే దక్కగా ఒక్క ఎంపి సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు.గత్యంతరం లేని పరిస్థితుల్లో తన పార్టీని ఆయన కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడిగా, మంత్రి పదవులతో సరిపెట్టుకున్నారు చిరంజీవి.
ఇక పవన్ కూడా చిరంజీవి ఆలోచించినట్టుగానే ఆలోచించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.కానీ ఆ తరువాత ఆయన ఎన్నికల బరిలో దిగకుండా బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు పలికారు.ఆ కూటమి గెలవడంతో ఆ క్రెడిట్ అంతా నాదే అని పవన్ చెప్పుకున్నారు.ఇక ఆ తరువాత పవన్ చేసిన వ్యూహాత్మక తప్పిదాల కారణంగా జనసేన పూర్తిగా బలం కోల్పోయింది.
ఆయన టీడీపీకి మద్దతుదారుడు అనే ముద్ర ఆయన మీద పడింది.ఇక ఇప్పుడు ఆ ముందర చెరుపుకుని బీజేపీతో కలిసి ముందుకు వెళ్తున్నా బీజేపీ జనసేన కూటమికి ఎంత ఆదరణ దక్కుతుంది అనేది అనుమానంగానే ఉంది.
ఎందుకంటే క్షేత్ర స్థాయిలో బీజేపీ, జనసేన పార్టీలకు బలం లేదు.కానీ ఈ విషయంలో టీడీపీ, వైసీపీ లు ఈ విషయంలో బాగా బలంగా ఉన్నాయి.ఇప్పుడు ఈ మూడో కూటమి బలపడాలి అంటే ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ బాగా బలహీనపడాలి.అది సాధ్యమయ్యే పనేనా అనే సందేహం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.
.