దాగుడు మూతల దండాకోర్ అన్నట్లుగా రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి.పైకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నట్లుగా వ్యవహారాలు ఉంటాయి.
స్నేహమైన , విరోధమైన రాజకీయాల వరకు చూసుకుంటే అది సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది.అకస్మాత్తుగా పొత్తులు, ఎత్తులు తెరపైకి వస్తూ ఉంటాయి.
ప్రస్తుతం ఏపీ రాజకీయాలను చూసుకుంటే, ఇక్కడ జనసేన ,తెలుగుదేశం, వైసిపి, బిజెపి ఇలా నాలుగు ప్రధాన పార్టీలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి.రోజురోజుకు తమ బలం పెంచుకుని జనాల్లో అధికారం దక్కించుకోవాలని, అధికారాన్ని నిలబెట్టుకోవాలనే విధంగా ముందుకు వెళుతున్నాయి.
ఇక ఏపీ అధికార పార్టీ గా వైసిపి ఉండగా , తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది.
జనసేన బీజేపీ లు ఏపీలో అధికారికంగా పొత్తు పెట్టుకున్నాయి.
కలిసి ఎన్నికలకు వెళ్లి సక్సెస్ అవ్వాలని చూస్తున్నాయి.అయితే 2014 ఎన్నికల సమయంలో జనసేన, టిడిపి , బిజెపిలు కలిసి పొత్తు పెట్టుకున్నాయి .జనసేన ఎన్నికలలో పోటీ చేయకపోయినా ,బిజెపి టిడిపి లకు మద్దతు ప్రకటించింది.2019 కి వచ్చేసరికి ఎవరికి వారు విడివిడిగా పోటీ చేశారు.ప్రస్తుతం బీజేపీ టీడీపీ మధ్య వార్ నడుస్తోంది.ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికలు టిడిపి జనసేన మరోసారి తెరపైకి తెచ్చాయి.చాలా మున్సిపాలిటీల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్న తీరు తో మళ్లీ ఈ రెండు పార్టీలు అధికారికంగా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయ్యాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.బిజెపిని సైతం పక్కనపెట్టి జనసేన, టిడిపి మున్సిపల్ ఎన్నికలలో పొత్తు పెట్టుకుని సీట్లు పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీల లోనూ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న తీరు చూస్తుంటే, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి జనసేన బిజెపి పూర్తిగా పక్కనపెట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.అయితే ఇప్పుడు ఈ దాగుడు మూతలు ఎందుకు అధికారికంగా టీడీపి, జనసేన పొత్తు పెట్టుకుంటే అనవసర గందరగోళం ఉండదు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న, ఆ పార్టీ అగ్రనేతలు ఎవరు కనీసం స్పందించడం లేదు.ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ తో కలిసి అడుగు వేస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతున్న సమయంలోనే కొన్ని కొన్ని మునిసిపాలిటీలలో ఈ పార్టీల పొత్తు విచ్చుకోవడం చర్చగా మారింది.