ఏపీలో జనసేన జోరు పెంచింది.పార్టీ అధినేత తొందర్లోనే బస్సు యాత్రతో జనాల్లోకి వెళ్లనున్నారు.
కౌలు రైతు భరోసా యాత్రలో ఎన్నో విషయాలను స్పష్టం చేసిన పవన్ ఆ నేతలను పార్టీలోకి లాగే పనిలో ఉన్నారట.మరో వైపు ప్రధాన పార్టీల నుంచి జనసేన వైపు గట్టిగానే వలసలు ఉంటాయని అంటున్నారు.
వచ్చే ఎన్నికలలో జనసేన తన సత్తా చాటగలదనే వారు ఆ పార్టీ వైపు చూస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.అదే విధంగా ప్రధాన పార్టీలు టికెట్లు నిరాకరిస్తాయని భావిస్తున్న వారు, తమకు చాన్స్ దక్కదని అంచనా వేసుకుంటున్న వారు కూడా ఇపుడు జనసేన వైపు చూస్తున్నారని సమాచారం.
ఇక పవన్ కూడా వారిని చేర్చుకుని పార్టీని బలోపేతం చేసే దిశగా సమాలోచనలు చేస్తున్నారు అంటున్నారు.
ఇక ఏపీలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో అప్పట్లో బలమైన నాయకులు అంతా చేరిపోయారు.
కాంగ్రెస్ టీడీపీల పట్ల విరక్తి గా ఉన్న వారే కాదు తమ సామాజికవర్గానికి చెందిన వారు సీఎం కావాలన్న బలమైన ఆకాంక్షతో చాలా మంది ప్రధాన పార్టీలను వీడారు.అయితే అప్పటి పరిస్థితులు అనుకూలించక ఆ పార్టీ అనుకున్న స్థాయిలో నిలవలేకపోయింది.
రాంగ్ టైంలో ఎంట్రీ వల్ల అటు వైఎస్సార్ ఇటు మహాకూటమితో చంద్రబాబు ఉండగా మరోవైపు తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉంది.ఈ పరిస్థితుల్లో గట్టెక్కలేకపోయారు.అయితే ఇప్పుడు ఆ పార్టీ మాజీ నేతలపై పవన్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే అదే కసితో పవన్ పవన్ పార్టీ స్ఠాపించినప్పటికీ 2014 ఎన్నికల్లో పవన్ పోటీ చేయలేదు.
టీడీపీ బీజీపీలకు మద్దతు మాత్రమే ఇచ్చి ఊరుకున్నారు. దీంతో ప్రజారాజ్యం పార్టీ నేతలు తలోదారి చూసుకున్నారు.
ఇక 2019లో జనసేన పోటీ చేసినా మాజీ పీఆర్పీ నేతలు టీడీపీ వైసీపీలలో అప్పటికే సెటిల్ అయ్యారు.అయితే వచ్చే ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వడానికి ఇప్పుడు మాజీ పీఆర్పీ నేతల మీద జనసేన ఫోకస్ చేస్తోందని అంటున్నారు.
బలమైన సామాజికవర్గం, అభిమానం ఉన్న వారు ఏ పార్టీలో ఉన్నా జనసేన వైపుగా మళ్లించాలన్న ప్లాన్ లో ఆ పార్టీ ఉందని అంటున్నారు.జిల్లాకు ఒకరిద్దరు బలమైన నేతలను లాగాలని వ్యూహాలను రచిస్తోంది.
ఇందులో భాగంగా కాపుల ఆరాధ్య దైవం దివంగత నేత వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధాను జనసేనలో చేర్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
ఆయన టీడీపీలో ఉన్నా సైలెంట్ గా ఉంటున్నారు.2019 ఎన్నికల ముందు వైసీపీని వీడినప్పటికీ రాధా స్నేహితులు కొడాలి నాని, వల్లభనేని వంశీలతో సఖ్యతగా ఉన్నారు.అయితే వైసీపి వెళ్తారనుకున్నప్పటికీ ప్రస్తుతం రాధా చూపు జనసేన వైపు ఉందని అంటున్నారు.
రంగా కుమారుడు జనసేనలో చేరితో కోస్తాలో పార్టీకి కొత్త ఊపు వస్తుందని జనసేన భావిస్తోంది.ఈ క్రమంలో ఈ నెల 4న తన తండ్రి 75వ జయంతి వేడుకలను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నారు.
దీంతో పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందింది.ఇంతకుముందే బెజవాడ వీధుల్లో రాధా పవన్ ఫ్లెక్సీలు వెలియడంతో రాధా సంకేతాలు ఇస్తున్నారని అంటున్నారు.
అలాగే మరోవైపు వైసీపీలో ఉన్న మాజీ పీఆర్పీ నేతలు ఎన్నికల వేళకు జనసేన గూటికి చేరే చాన్స్ ఉందని అంటున్నారు.అలాగే టీడీపీ నుంచి కూడా కొందరు నేతలు అదే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
మొత్తానికి పవన్ మాజీ పీఆర్పీ నేతలను లాగడానికి ట్రై చేస్తున్నట్లు చెబుతన్నారు.ఇదే జరిగితే పార్టీ మరింత బలపడి గట్టి పోటీ ఇవ్వగలదని అంటున్నారు.