రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరని ఎవరన్నారో కానీ ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే చాలా కరెక్ట్ గా అన్నారని అనిపిస్తోంది.ఎందుకంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు తిట్టుకుంటున్నారో, ఎప్పుడెప్పుడు కలుస్తున్నారో తెలియడంలేదు.
నిన్నటి వరకు ఒక పార్టీని తిట్టిన నాయకుడు రాత్రికి రాత్రే అదే పార్టీలో చేరిపోయి జిందాబాద్ లు కొట్టడం చూస్తూనే ఉన్నాం.రాజకీయాలంటే ఇవన్నీ షరామామూలే అని సరిపెట్టుకోవాలి.
సరే ఇక విషయానికి వస్తే, ఏపీలో అధికారంలోకి రాబోతోంది అని ప్రచారం జరుగుతున్న వైసీపీని కలుపుకు పోయేందుకు కాంగ్రెస్ పార్టీ అప్పుడే మెల్లిమెల్లిగా ప్రయతనాలు మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది.
జగన్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడే.
ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ లో మూడున్న దశాబ్దాల బంధం పెనవేసుకున్న వారు.కాంగ్రెస్ సీఎం గానే ఆయన మరణించారు.
అంతటి బంధం ఉన్న కుటుంబాన్ని కాంగ్రెస్ ఎలా వదిలేసుకుంటుంది ? ఎన్ని గొడవలు ఉన్నా మేమంతా ఒక్కటే.అంటూ కాంగ్రెస్ పార్టీ మెల్లిమెల్లిగా దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
తాజాగా తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ చూస్తే జగన్ కోసం కాంగ్రెస్ అపుడే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.జగ్గారెడ్డి అయితే జగన్ ఖచ్చితంగా తమకే మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఆయన మద్దతు ఇస్తారు అని చెప్పేస్తున్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ గద్దె ఎక్కాలంటే వైసీపీ ఎంపీల మద్దతు అవసరం అని కాంగ్రెస్ ఇప్పటికే గుర్తించేసింది.అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తున్న చంద్రబాబుని ఓ వైపు భుజాల మీద వేసుకుని తిరుగుతూ ఇపుడు జగన్ మద్దతు కావాల్సివచ్చిందంటే జగన్ ఏపీలో గెలవబోతున్నాడన్న సంకేతలు ఆ పార్టీకి వచ్చినట్టు అర్ధం అవుతోంది.అందుకే అప్పుడే పాత సంగతులు అన్నీ మర్చిపోయి మరీ జగన్ మద్దతు కోసం పాకులాట మొదలెట్టేశారు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.