ఎన్నికల సమయంలో నేరుగా ప్రజలకి మధ్యలోకి వెళ్లి రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం ఈ మధ్య కాలంలో కష్టం అయిపోతుంది.డబ్బుని ఎలా తరలించిన ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేసే పోలీసులు పట్టుకొని సీజ్ చేసేస్తున్నారు.
దీని వలన కోట్ల రూపాయిలు ఎవరికి చెందకుండా పోతున్నాయి.మరో వైపు నాయకులు సొమ్ములు పోగొట్టుకుని తలపై తడిగుడ్డ వేసుకోవాల్సి వస్తుంది.
దీంతో ఈ సారి రాజకీయ పార్టీలు కొత్త ఎత్తులు వేసి ప్రజలకి డబ్బులు పంచడం మొదలెట్టాయి.ఓటర్ కి డబ్బు చేరడం ముఖ్యం గాని ఎలా చేరితే ఏంటి అనే ఆలోచనతో నేరుగా ప్రజల ఖాతాలలోకి డబ్బులు జమ చేస్తూ ఓట్లు కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్లో వందల సంఖ్యలో జన్ధన్ ఖాతాల్లో అనుమానాస్పదంగా డబ్బులు జమ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.మోరదాబాద్ జిల్లాలో 1700 జన్ధన్ ఖాతాల్లో గత కొద్ది రోజుల్లోనే పెద్ద మొత్తంలో డబ్బు జమ అయ్యాయి.
దీంతో ఎన్నికల అధికారులు ఆ బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టారు.ఒక్కో ఖాతాలో 10,000 చొప్పున మొత్తం 1.7కోట్లు డిపాజిట్ అయినట్లు అధికారులు గుర్తించారు.దీంతో ఆదాయపు పన్నుశాఖ రంగంలోకి దిగి దర్యాప్తు మొదలెట్టింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈ డబ్బు వారి ఖాతాల్లోకి జమ చేసి ఉంటారని అధికారులు విశ్వసిస్తున్నారు.
ఇక ఈ డబ్బులు ఎవరు వేసారో తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పుడు అధికారులు ఉండగా, తాము వాడిన కొత్త ఆలోచనతో ఇలా అధికారులకి అడ్డంగా దొరికిపోవడంతో రాజకీయ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.మొత్తానికి బ్లాక్ మనీని బ్యాంకుల ద్వారా ఓటర్స్ కి అందిస్తే ఎలా అడ్డంగా బుక్ అవుతారో ఈ సంఘటనతో స్పష్టం అయ్యింది.