ఒకపక్క దేశం మొత్తం కరోనా మహమ్మారి తో పోరాడుతుంటే జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు.కరోనా కట్టడి కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా అని చూస్తున్న ఈ సమయంలో ఉగ్రవాదులు రెచ్చిపోయి మరింత నష్టం కలిగిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఐదుగురు జవాన్లు అమరులయ్యారు.
ఆదివారం తెల్లవారుజామున ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతాలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఓ కల్నల్, మేజర్, ఇద్దరు జవాన్లు, ఓ సబ్-ఇన్స్పెక్టర్ ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. హంద్వారా ప్రాంతంలోని కుప్వారా జిల్లాలోని చంజ్ముల్లా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్టు ఆర్మీ అధికారులకు సమాచారం అందడంతో సైన్యం అక్కడకు చేరుకుంది.
కొంత మంది పౌరులను ఉగ్రవాదులు బందీలుగా చేసుకోవడంతో వారిని రక్షించడానికి ఆర్మీ అధికారులు బృందం ఆపరేషన్ నిర్వహించింది.అయితే ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టింది కానీ ఉగ్రవాదులు కూడా రెచ్చిపోయి ఆర్మీ పై ఎదురుకాల్పులు జరపడం తో మేజర్,కల్నల్ తో సహా ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
కుప్వారా జిల్లా లో ఉగ్రవాదులు చొరబడ్డారు అన్న విషయం తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ 21 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూజ్ సూద్ బృందం ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలిస్తున్న సమయంలో ముష్కరులు కాల్పులు జరిపారు.అయితే వెంటనే అప్రమత్తమయిన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
అయితే ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్న పౌరులను వారి బారి నుంచి రక్షించగలిగారు గానీ కల్నల్,మేజర్ తో సహా ఐదుగురు వీరమరణం పొందారు.కల్నల్ శర్మ వరుసగా రెండుసార్లు సేన మెడల్స్ను అందుకున్నారు.
విధి నిర్వహణలో ఆయన చూపిన తెగువకు సేన మెడల్ ఫర్ గ్యాలెంటరీ అవార్డులు దక్కాయి.హంద్వారా వద్ద 2018లో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులతో వీరోచిత పోరాటం చేసినందుకు గాను కూడా ఆయనకు రెండోసారి సేన మెడల్ దక్కింది.