ఇటీవల ఢిల్లీ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఒక్కసీటు కూడా గెలుచుకోకుండా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవ్వడం తో ఓటమిని కరోనా వైరస్ తో పోల్చారు ఆ పార్టీ సీనియర్ లీడర్ జైరాం రమేష్.
కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా కరోనా వైరస్ సోకినట్లుగా ఎన్నికల్లో భారీగా నష్టం జరిగిందని జైరాం రమేష్ అన్నారు.ఢిల్లీ ఎన్నికల్లో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), షహీన్బాగ్ నిరసనల్ని ప్రచార అస్త్రంగా చేసుకొని బీజేపీ ఓట్లను చీల్చడం వల్ల ఆ పార్టీ గెలవలేదు కానీ, ఎక్కువ నష్టం కాంగ్రెస్ పార్టీకి జరిగిందన్నారు.
అంతేకాకుండా మైనార్టీ మతవాదం పై కాంగ్రెస్ పార్టీ చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది అంటూ దుష్ప్రచారం కూడా జరుగుతుంది అని ఆయన తెలిపారు.అయితే ఢిల్లీలో 2015 అసెంబ్లీ ఎన్నికలు గని,2020 అసెంబ్లీ ఎన్నికల్లో గానీ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 70స్థానాల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం విశేషం.
అంతేకాకుండా మూడు స్థానాల్లో తప్ప మొన్న జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులందరూ డిపాజిట్లు కూడా కోల్పోయారు.గాంధీ నగర్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ,బద్లి స్థానం నుంచి దేవేందర్ యాదవ్,కస్తూర్భానగర్ నుంచి అభిషేక్ దుత్త్ లు వీరు మాత్రమే డిపాజిట్లు దక్కించుకోగలిగారు.
మిగిలిన అన్ని చోట్ల కూడా ఆ పార్టీ నేతలకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం గమనార్హం.మరో కొత్త విషయం ఏంటంటే 2015లో 9.7శాతం ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్,మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం4.26శాతం ఓట్లు మాత్రమే దక్కించుకుంది.
ఈనెల 8 న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఆప్ పార్టీ 70 స్థానాలకు గాను 62 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగురవేయగా,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 8 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది.దీనితో ఢిల్లీ లో ముచ్చటగా మూడోసారి ఆప్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.ఆదివారం (ఫిబ్రవరి 16) న ఢిల్లీ సీఎం గా అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు
.