తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషయంలో అధిష్టానం సానుకూలంగా ఉందనే సంకేతాలతో కాంగ్రెస్ సీనియర్లలో ఇప్పుడిప్పుడే ఆయన విషయంలో తమ వైఖరి మార్చుకుంటున్నట్టు గా కనిపిస్తోంది.ఎప్పుడూ రేవంత్ నిర్ణయాల పైన విమర్శలు చేస్తూ, ఆయనను టార్గెట్ చేసుకుంటూ వచ్చే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పుడు స్వరం మార్చారు.
రేవంత్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టిస్తున్నారు.అసలు రేవంత్ తనను ఏ సమావేశానికి ఆహ్వానించకుండా అవమానిస్తున్నారంటూ తనకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారంటూ గతంలో అనేకసార్లు జగ్గారెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు.
అలాగే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించే సమయంలోనూ జగ్గారెడ్డి అధిష్టానం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.అయితే ఇప్పుడు రేవంత్ విషయంలో జగ్గారెడ్డి మెత్తబడినట్టే కనిపిస్తున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంత వరకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని కొనసాగించాలని జగ్గారెడ్డి ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు.ఇప్పుడు రెడ్డిని దించేయాలని పార్టీలో ఎవరూ కోరుకోవడం లేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
పిసిసి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా, పార్టీ నాయకులు అందరిని కలుపుకుని పనిచేయాల్సిన బాధ్యత ఉంటుందని జగ్గారెడ్డి అన్నారు.పాదయాత్ర చేయాలని అభిప్రాయం పార్టీలో ఎవరికైనా ఉండవచ్చని, కానీ పిసిసి అధ్యక్షుడికే ప్రాధాన్యం ఉంటుందని, రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే తాను మనస్ఫూర్తిగా సహకరిస్తానంటూ జగ్గారెడ్డి ప్రకటించారు .ఈ సందర్భంగా రేవంత్ పైన సుత్తిమెత్తగా విమర్శలు చేశారు.రేవంత్ ఏ నిర్ణయం విషయంలోనూ తమను సంప్రదించడం లేదని, ఇటీవల ఆయన చేసిన కొన్ని తొందరపాటు వ్యాఖ్యల గురించి పార్టీ భేటీలో అడుగుతానని అన్నారు.
సీఎల్పీ నేత భట్టి ఒక నటుడని ఆయన గురించి అర్థం కాదని జగ్గారెడ్డి విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో తాము మొదటి స్థానానికి వెళ్లి అధికారంలోకి రావాలని , ప్రజలకు మరింత సేవ చేయాలని , టిఆర్ఎస్ రెండవ స్థానానికి వెళ్లాలన్నదే లక్ష్యం అని జగ్గారెడ్డి అన్నారు.తెలంగాణలో బిజెపి హడావుడి చేస్తున్నా, హైటెక్ డ్రామాలు ఓటు బ్యాంకును మార్చలేవని విమర్శించారు.అయితే మొదటి నుంచి రేవంత్ ను వ్యతిరేకిస్తూ వస్తున్న జగ్గారెడ్డి ఇప్పుడు ఆకస్మాత్తుగా ఆయనకు సహకరిస్తానని చెబుతూ రేవంత్ విషయంలో సానుకూలంగా స్పందించడం తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో పాటు, తెలంగాణ.
రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారాయి.