తెలంగాణాలో రాజకీయ వలసలకు ఇంకా అడ్డుకట్ట పడినట్టు కనిపించడంలేదు.తెలంగాణ లోక్ సభ ఎన్నికల ముందు కనిపించిన హడావుడి ఇప్పుడు మళ్ళీ కనిపిస్తోంది.
తెలంగాణాలో విపక్షమే లేకుండా చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ విపక్ష పార్టీల నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకునే పనిలో పడింది.ఇక కాంగ్రెస్ ఎమ్యెల్యేలు కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి టీఆర్ఎస్ లో చేరడమే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారు.
ఈ పరిణామాలన్నీ టీఆర్ఎస్ కి కలిసివస్తుండగా, కాంగ్రెస్ పార్టీ లో ఆందోళన కలిగిస్తోంది.కాంగ్రెస్ లో గట్టి నాయకుడిగా పేరున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్తో చేతులు కలిపారు.
ఆయనతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం గులాబీ గూటికి చేరతారని అప్పుడే ప్రచారం జోరందుకుంది.
అయితే జగ్గారెడ్డి మాత్రం టీఆర్ఎస్ లో చేరే విషయంలో ఎటువంటి క్లారిటీ కి రాలేకపోతున్నాడు.
ఇదే విషయమై నిన్న ( గురువారం) కీలక వ్యాఖ్యలు చేసారు.ఇవి అందరిలోనూ ఆసక్తిని పెంచాయి.అదేంటంటే టీఆర్ఎస్లోకి రావాలని కేసీఆర్, కేటీఆర్ బంధువులు తనను ఆహ్వానించారని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.గాంధీభవన్లో ఉంటానో.
తెలంగాణభవన్లో ఉంటానో త్వరలో తెలుస్తుందని ఆయన తెలిపారు.మే 30 లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని క్లారిటీ కూడా ఇచ్చేసారు.
కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ సేఫ్ జోన్లో ఉంటుందని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కష్టమంటూ జగ్గారెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేసారు.
ఏపీ- తెలంగాణ విడిపోయిన తరువాత తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రజలకు ఎంత మేలు జరిగింది అనే విషయం మాత్రం తనకు తెలియదు అంటూ చెప్పుకొచ్చారు.జగ్గారెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర రాజకీయాల్లో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ ఖాయమని, జగ్గారెడ్డి టీఆర్ఎస్లో చేరతారని ఇప్పటికే అనేకమంది నాయకులు చెప్పుకొస్తున్నాన్రు.
మరికొందరు మాత్రం జగ్గారెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారని గట్టిగా చెప్తున్నారు.జగ్గారెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారని, మంచి ముహూర్తం చూసుకుని పార్టీ మారిపోవడం ఖాయం అంటూ జగ్గారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.
అయితే ఆయన కనుక పార్టీ మారితే తెలంగాణాలో బలమైన నాయకుడిని కాంగ్రెస్ కోల్పోయినట్టు అవుతుంది అనడంలో సందేహం లేదు.