వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలస నాయకుల బాధలు అన్నీ ఇన్నీ కావు.వివిధ కారణాలతో తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన నాయకులు ఇప్పుడు తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే బాధలో కనిపిస్తున్నారు.
అసలు చాలామంది నాయకులు యాక్టివ్ గా ఉన్నట్లుగా కనిపించడం లేదు.వీరే కాకుండా మొదటి నుంచి జగన్ వెన్నంటే నడిచిన వారు ఇదే బాధ లో ఉన్నారు.
ఏదో ఒక పార్టీలో ఉన్నామన్న పేరు తప్ప, ఎక్కడా యాక్టివ్ గా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆనవాళ్లు కనిపించడం లేదు.పార్టీలో చేరే ముందు ఎన్నో హామీలు ఇచ్చి చేర్చుకున్నారు అని, అధికారం వచ్చి ఏడాదైనా ఇప్పటికీ తమను పట్టించుకోవడం లేదని ,పదవుల్లోనూ, పార్టీలోనూ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు.
వీరే కాకుండా మొదటి నుంచి జగన్ వెంట నడిచిన నాయకులు చాలామంది ఉన్నారు.వారిలో కొంతమందికి టిక్కెట్లు దక్కగా, మరికొంతమందికి టికెట్లకు బదులుగా వేరే పదవులు ఇస్తామంటూ ఎన్నికల ముందు వారిని బుజ్జగించారు.
కానీ ఏడాదైనా తమ వైపు దృష్టి పెట్టినట్లు కనిపించకపోవడంతో మీరు బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతుగా గట్టిగానే కృషి చేశామని, ఇక అధికారం రావడంతో తమ రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని చాలా మంది భావించారు.
ముఖ్యంగా సీనియర్ నాయకులకు చాలా మందికి జగన్ ఆఫర్లు ఇచ్చారు.
ముఖ్యంగా దాడి వీరభద్రరావు , సి రామచంద్రయ్య, మొదటినుంచి జగన్ తో నడుస్తున్న మర్రి రాజశేఖర్ ఉన్నారు.వీరంతా తమకు ప్రభుత్వంలో కీలక పదవులు దక్కుతాయని ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు.కానీ ఇప్పటివరకు ఆ వైపుగా జగన్ దృష్టి పెట్టకపోగా, శాసన మండలి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని కూడా వారు తప్పు పడుతున్నారు.
ఇవే కాకుండా అనేక కార్పొరేషన్ పదవిలోనూ రిజర్వేషన్లు పేరు చెప్పి తమను పక్కన పెట్టేశారు అని చాలామంది అసహనంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు వచ్చి చేరేందుకు సిద్ధమవుతున్నారు.
వీరికి అనేక పదవులను ఆశ చూపిస్తున్నారు.ఇలా వలస నాయకులు పెరిగిపోతుండటం, తమ ప్రాధాన్యత పార్టీలో తగ్గిపోతున్నట్టు కనిపిస్తుండడంతో వీరు తమ ఆవేదనను బయటకు చెప్పలేక , దాచుకోలేక తీవ్రమైన బాధను అనుభవిస్తున్నారు.
అందుకే పార్టీ లోనే ఉన్నా, ఏ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మౌనంగానే ఉండిపోతున్నారు.ఇక ప్రజా పరిపాలన అంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుండడం, ప్రజాప్రతినిధుల ప్రమేయం పెద్దగా లేకపోవడంతో, వీరు ఇళ్లకే పరిమితమై పోతున్నారు.అధినేతను కలిసి ఈ విషయాల పై చర్చించి, పదవి విషయంలో హామీ తీసుకుందాం అనుకున్నా, జగన్ అపాయింట్ మెంట్ దొరకకవడంతో వీరిలో బాధ మరింత ఎక్కువవుతోంది.