ఏపీ సీఎం జగన్ అప్పుడే ఎన్నికలకు సిద్ధమైపోతున్నట్టు గా కనిపిస్తున్నారు.తనతో పాటు, తమ పార్టీ నాయకులను హడావుడి పెడుతూ జనాల్లోకి వెళ్లే విధంగా పార్టీ కార్యక్రమాలను రూపకల్పన చేశారు.
దీనిలో అధికారులను కూడా భాగస్వామ్యం చేశారు.గడపగడపకు ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రస్తుతం అమలు చేస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలక నాయకులు, ప్రభుత్వ అధికారులు ఇలా అంతా గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పడం తో పాటు, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కార మార్గాలు చూపించే విధంగా జగన్ ప్లాన్ చేశారు.
ఇక తాను కూడా గతం కంటే భిన్నంగా జిల్లాల వారిగా పర్యటనలు చేస్తూ, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా టిడిపి, జనసేన పార్టీలపైనా, మీడియా పైన విమర్శలు చేస్తున్నారు.ప్రజా సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం పని చేస్తున్నా, తమ రాజకీయ స్వార్థం కోసం టిడిపి, జనసేన, టిడిపి అనుకూల మీడియా పని చేస్తోందని పదేపదే జనాలకు అర్థం అయ్యేలా చెబుతున్నారు. తాను రాజకీయం చేయనని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, తన నిబద్ధతను, నిజాయితీని ప్రజల గమనించాలని జగన్ కోరుతున్నారు.కేవలం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పైన, ప్రభుత్వ నిర్ణయాలపైన రంధ్రాన్వేషణ చేస్తున్న టీడీపీ అనుకూల మీడియా గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ విధంగా చేయలేకపోయిందని జగన్ ప్రశ్నిస్తున్నారు.
బాబు ఏం చేసినా సైలెంట్ గా ఉండే టీడీపీ అనుకూల మీడియా తన పైన మాత్రమే బురదజల్లుతోంది అని , దీని వెనుక వారి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాన్ని గుర్తించాలని జగన్ కోరుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండానే చంద్రబాబు దత్త పుత్రుడు అంటూ విమర్శలు చేశారు.ప్రస్తుతం జగన్ దూకుడుగా ముందుకు వెళ్తూ .ప్రజల్లో సానుభూతి పొందేలా మాట్లాడుతూ, తమ రాజకీయ ప్రత్యర్ధులను ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే జగన్ అప్పుడే ఎన్నికలకు సిద్ధం అయిపోతున్నారా అనే అనుమానాలు ఎన్నో కలుగుతున్నాయి.