ఏపీ అసెంబ్లీ కౌరవ సభగా మారిందని, ఇటువంటి సభలో తాను ఉండలేనని , తాను మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ అసెంబ్లీలో అడుగు పెడతాను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆగ్రహంతో ప్రకటించారు.అదేపనిగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు , చంద్రబాబుపై విమర్శలు చేయడంతో పాటు, చంద్రబాబు కుటుంబ వ్యక్తుల పైన పరోక్షంగా విమర్శలు చేయడం తదితర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ వ్యవహారం తర్వాత చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం, ఏపీలో రాజకీయ వర్గాల్లో కలకలం రేగడం వంటివి జరిగాయి.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు .
మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.దీనికి మంత్రిమండలి సైతం ఆమోదం తెలిపింది.
దీంతో అమరావతి జేఏసీ నేతలతో పాటు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.అయితే ఇది ఇక్కడితో అయిపోలేదు అని కేవలం కోర్టులో కొన్ని సాంకేతిక కారణాలతో ఇబ్బందులు ఈ బిల్లులో ఉన్నందున దీనిని రద్దు చేశామని మరో రూపంలో మళ్లీ వస్తాను అంటూ జగన్ ప్రకటన చేశారు .అంటే కోర్టులలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా, ముందస్తు అన్ని జాగ్రత్తలు తీసుకుని మరి ఈ బిల్లును ఏపీ ప్రభుత్వం మరోసారి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.అంటే 2 సభల్లోనూ ఈ బిల్లు మళ్లీ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
గతంలో మాదిరిగా ఇప్పుడు ఈ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే శాసనమండలిలోనూ వైసీపీకి పూర్తి మెజారిటీ ఉంది .దీంతో వెంటనే ఈ బిల్లును జగన్ ఆమోదం పొందేలా చేయగలరు.కాకపోతే ఇటువంటి కీలక బిల్లుపై చర్చించే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు సభలో ఉండాలి.
ఎందుకంటే గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అటువంటి అమరావతి ని పక్కన పెట్టి జగన్ మూడు రాజధానులపై మరింత శక్తివంతమైన బిల్లును ప్రవేశపెడితే , దీనిపై అసెంబ్లీలో చర్చించడం, ప్రభుత్వం నిర్ణయం ను అడ్డుకునేందుకు ప్రయత్నించడం వంటి వ్యవహారాలు చంద్రబాబు చేయాల్సి ఉంటుంది.అలాగే రాజధాని రైతులకు అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుపై ఉంది. ఎందుకంటే బాబు మాత్రమే తమకు న్యాయం చేయగలడని అమరావతి ఉద్యమకారులు, రైతులు ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు తన శపథం కోసం వారి ఆశలను బాబు అడియాశలు చేయరు.
జగన్ నిర్ణయంతో బాబు మళ్లీ అసెంబ్లీ లో అడుగుపెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.