విపక్షాలు తమను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ, హైలెట్ కాకుండా చేసేందుకు ప్రయత్నించినా, జగన్ మాత్రం తాను అనుకున్నది చేసి చూపిస్తూ, ప్రతిపక్షాలకు నిత్యం సవాళ్లు విసురుతూనే ఉన్నారు. జగన్ 2019లో ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్న అతి కీలక నిర్ణయాలలో మూడు రాజధానుల అంశం ఒకటి.
ఈ విషయంలో జగన్ ఎంతగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే అంత దానిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతూ, అనేక వ్యవహారాలు రచించడంతో పాటు, కోర్టులలోను ఇబ్బందులు ఏర్పడే విధంగా వ్యవహరించడం తదితర కారణాలతో మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ అసెంబ్లీలో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయంలో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, తాము విజయం సాధించామని ప్రతిపక్షాలు సంబరపడుతుండగానే జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకుని ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు.
ముందుగా తీసుకున్న మూడు రాజధానుల బిల్లులో లోటు పాట్లు ఉండడంతోనే, దానిని రద్దు చేశామని, ఈసారి ఎటువంటి న్యాయవివాదాలు చోటు చేసుకోకుండా మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.తాజాగా విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు జగన్ నిర్ణయించుకున్నారు.
దీని ద్వారా పరిపాలన మొత్తం విశాఖ నుంచి మొదలవుతుందని, ఈ విధంగా అయినా తాను తీసుకున్న నిర్ణయం అమలవుతుందని, మూడు రాజధానుల బిల్లు చట్ట రూపం దాల్చినా , దాల్చకపోయినా తన మాట ప్రకారం తన నిర్ణయం అమలు అవుతుంది అనే లెక్కల్లో జగన్ ఉన్నారట.
దీనికి దసరా రోజున జగన్ శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం.మూడు రాజధానుల బిల్లు విషయమై స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జగన్ ప్రకటన చేశారు.ఇప్పుడు దసరా రోజున విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా విపక్షాలకు షాక్ ఇవ్వాలనే అలోచనలో జగన్ ఉన్నారట.
విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా అనధికారికంగా విశాఖ నే రాజధానిగా చేసినట్లు అవుతుందనేది జగన్ అసలు వ్యూహమాట.
.