2024 ఎన్నికల్లో గెలుపే ఏకైక లక్ష్యంగా జగన్ ముందుకు వెళుతున్నారు .ఈ విషయంలో అన్ని మొహమాటలను పక్కనపెట్టి పార్టీని ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసేందుకు జగన్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.తనకు అత్యంత సన్నిహితులైన వారిని పక్కన పెట్టేందుకు జగన్ ఆలోచన చేయడం లేదు.2019 ఎన్నికల తో పోలిస్తే 2024 ఎన్నికలు కష్టంగా ఉంటాయనేది జగన్ కు బాగా తెలుసు.గతంతో పోలిస్తే టిడిపి జనసేన వంటి పార్టీలు బలం పెంచుకోవడం, ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతాయి అని జగన్ అంచనా వేస్తున్నారు. పెద్ద ఎత్తున ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న , వాటి అమలు, ఇతర కారణాలతో ప్రజల్లో కాస్త అసంతృప్తి ఉందనే విషయాన్ని జగన్ గుర్తించారు.
అందుకే జాగ్రత్తగా రాజకీయ అడుగులు వేస్తున్నారు.ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీరుస్తూ పార్టీకి ప్రభుత్వానికి మేలు చేకూరే విధంగా వ్యవహరించాలంటూ పదేపదే జగన్ చెబుతున్నారు.పనితీరు సక్రమంగా లేని వారిని పక్కనపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గతంతో పోల్చితే జగన్ లో చాలా మార్పు కనిపిస్తోంది.మొదటి నుంచి తను వెంట నడిచినవారి పనితీరు సక్రమంగా లేకపోతే వారిని పక్కన పెట్టేందుకు, వారికి కేటాయించిన పదవుల నుంచి తప్పించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.
ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ని పార్టీ కీలక బాధ్యతలు నుంచి తప్పించారు.
సజ్జల అంటే జగన్ కు చాలా నమ్మకం.అసలు ఎవరు జగన్ ను కలవాలన్నా ముందుగా సజ్జల ఓకే చెప్తేనే అది జరుగుతుంది.అంతగా పార్టీలోను ప్రభుత్వంలోను ఆయనకు ప్రాధాన్యం ఉన్నా, ఆయనను పక్కన పెట్టారు.
ఇక మరో సన్నిహితుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కర్నూలు , నంద్యాల జిల్లాల సమన్వయకర్తల బాధ్యతలు నుంచి తప్పించారు.ఇక కొడాలి నాని, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్ వంటి వారిని జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు.
త్వరలోనే మరొకరికి ఈ బాధ్యతలను అప్పగించబోతున్నారు.అయితే అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారిని పదవుల నుంచి తప్పించి వారికి ఏ స్థాయిలో మరో పదవి ఇచ్చి ప్రాధాన్యం కల్పిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది .కానీ ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం వైసిపి కీలక నాయకులకు కూడా అంతు పట్టడం లేదు.అసలు జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది తెలియక తికమక పడుతున్నారు వైసీపీ నాయకులు.