ఇంటా బయటా తనకు ఎదురవుతున్న ఇబ్బందులతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తీవ్ర అసహనంతో ఉన్నారు.తాను ఒక ముందు చూపుతో రాజకీయం చేసుకుంటూ పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళుతుంటే, రాజకీయ ప్రత్యర్థులతో పాటు ఇప్పుడు సొంత పార్టీ నేతలు కూడా అసమ్మతి వినిపిస్తూ, ఆ విషయాన్ని బహిరంగంగా మీడియా ద్వారా వెళ్లగక్కడం జగన్ కు తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని కలుగజేస్తున్నాయి.
పోనీ వాటికి గట్టిగా వార్ణింగ్ ఇద్దామా అంటే వారంతా తలలు పండిన రాజకీయ నాయకులు.వీరిలో చాలామంది తన తండ్రి రాజశేఖరరెడ్డి హయాంలో ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారే.
ఆ కారణంతోనే జగన్ వారి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.వారి వ్యవహారశైలి ముందు ముందు ఈ విధంగా ఉంటే తనకు ఇబ్బంది అనే విషయాన్ని గ్రహించిన జగన్ వారిని ఇక పూర్తిగా పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జగన్ మంత్రివర్గాన్ని చూసుకున్నా, ఎక్కువగా యువ నాయకులే కనిపిస్తారు.ముగ్గురు నలుగురు సీనియర్ లు తప్ప మిగతా వారంత యువ నాయకులే ఎక్కువగా కనిపిస్తారు.2019 ఎన్నికల్లో గెలవడం అత్యవసరం కాబట్టి జగన్ కొన్నిచోట్ల సీనియర్ నాయకులను, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్యేగా గెలిపించారు.వారిలో చాలామందికి సొంతంగా గెలిచే అంత సత్తా లేకపోయినా, జగన్ గాలిలో వారు గెలిచారు.
కానీ గెలిచిన దగ్గర నుంచి తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తిని సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వెనుకాడకపోవడం, వంటి పరిణామాలు జగన్ కు వారిపై ఉన్న మంచి అభిప్రాయాన్ని కూడా తుడిచేస్తోంది.
దీంతో 2024 ఎన్నికల నాటికి సీనియర్ నాయకులు అందరిని పూర్తిగా పక్కన పెట్టాలని, పార్టీలో తన మాట వింటూ చురుగ్గా వ్యవహరించే వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట.అలాగే పార్టీలో సీనియర్లు అయినా, జూనియర్ అయినా, తనమాట, పార్టీ నియమాలు, నిబంధనలు పాటించిన వారికి మాత్రమే తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, మిగిలిన వారిని పూర్తిగా పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.కొద్దిరోజులుగా ఇసుక వ్యవహారంలో కొంతమంది పార్టీ సీనియర్ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ప్రతిపక్షాలకు ఆయుధాలను అందించడంతో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.