ప్రతిపక్ష నాయకుడు వై .ఎస్ జగన్ పై తెలుగుదేశం మంత్రి దేవినేని ఉమా సంచలన ఆరోపణలుచేశారు .
రైతుల రుణమాఫీని ఏపీలో కేవలం నాలుగు జిల్లాలకే ఆర్బీఐ పరిమితం చేయడం వెనుక జగన్ పాత్ర దాగుందని అనుమానం వ్యక్తం చేశారు దేవినేని .రిజర్వ్ బ్యాంక్కు వైసీపీ దొంగలేఖలు పంపిస్తోందని, రాష్ట్రంలో రైతులు చాలా బాగున్నారని, కొన్నేళ్లుగా వారికి వ్యవసాయంలో ఎటువంటి నష్టాలు రాలేదని అబద్ధపు లేఖలు పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని జగన్మోహన్రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు.
తాము రుణ మాఫీ గురించి రిజర్వ్ బ్యాంక్ ను ఒప్పించడానికి నానా ఇబ్బందులు పడుతుంటే రాష్ట్రంలో రైతుల పరిస్థితులు బాగున్నాయని కలెక్టర్ల నివేదికలు స్పష్టం చేస్తున్నాయంటూ, వాటి నకళ్లను జగన్ నాంపల్లిలోని ఓ జిరాక్స్ కేంద్రం నుంచి ఆర్బీఐకు ఫ్యాక్స్లు పంపారని ఆరోపించారు.
తమ ప్రభుత్వం రుణమాఫీ నిర్ణయాన్ని అమలు చేస్తుండడం చూసి తట్టుకోలేకే వైయస్ జగన్ ఇలాంటి పనులకు పాల్పడుతున్నారన్నారు.
జగన్ దొంగతనంగా ఆర్బీఐకు లేఖలు పంపాల్సిన అవసరం లేదని, నేరుగా తన సొంత ఛానల్ సాక్షి టీవీ, పేపర్ ద్వారా పంపొచ్చని ఆయన ఎద్దేవా చేశారు.ఎవరూ ఎన్ని పన్నాగాలు పన్నినా రైతులకు రుణమాఫీ చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
అయితే రైతుల రుణాలు మాఫీ చేయలేక వైఎస్ జగన్మోహన రెడ్డి నివేదికలు పంపుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి నేత లు మండిపడ్డారు.ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, రైతులను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి దిగజారుడు ప్రచారానికి టీడీపీ పాల్పడుతోందన్నారు.
దమ్ముంటే 10 రోజుల్లో ఏ ఏజెన్సీతోనైనా విచారణ చేయించుకోండన్నారు.వాస్తవాలు బయటపెట్టండని కూడా సవాల్ విసిరారు.
వైఎస్ఆర్ సీపీపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే మీరు పదవి వదులు కోవడానికి సిద్ధమా? అని ఆయన ఉమను ప్రశ్నించారు.