వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆషామాషీగా నడపాలని అయితే మాత్రం జగన్ చూడడం లేదు. మరో పది పదిహేనేళ్ల పాటు తమ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా తామదే విజయం అనే విధంగా జగన్ వ్యవహారాలు చేసుకుంటూ వస్తున్నారు.ఒక వైపు ప్రతిపక్షాలను కట్టడి చేయడంతో పాటు , సొంత పార్టీలోని నేతలు వ్యవహారశైలి పైన జగన్ దృష్టి పెట్టారు.
ముఖ్యంగా ఎమ్మెల్యేలు ,మంత్రుల పనితీరు పై జగన్ నిఘా వర్గాల రిపోర్టులను చెప్పించుకుంటూ ఎప్పటికప్పడు వారి పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది.
మరో ఆరు నెలల కాలంలో తప్పనిసరిగా క్యాబినెట్ ను జగన్ ప్రక్షాళన చేస్తారు.
ప్రస్తుతం ఉన్న మంత్రుల లో మూడు వంతుల మందిని తప్పించి కొత్తవారిని జగన్ నియమించబోతున్నారు.
అయితే ఇందులో ఎవరేవరికి మంత్రి పదవులు ఇస్తారు ఏ ప్రాతిపదికన తప్పించి ఎవరికి కొత్తగా అవకాశం కల్పిస్తారనే విషయంపై వైసీపీలో చర్చ జరుగుతోంది.ప్రస్తుత మంత్రుల పని తీరుపై క్షుణ్ణంగా రిపోర్టులను జగన్ తెప్పించుకుంటున్నారు.
మంత్రి పదవులు స్వీకరించిన తర్వాత పార్టీకి ప్రభుత్వానికి వారు ఏ విధంగా మేలు చేశారు.ప్రజల్లోకి ఎంతవరకు ప్రభుత్వ విధానాలను తీసుకువెళ్లారు ? ఎవరెవరికి మళ్లీ మంత్రి పదవుల్లో కొనసాగే అవకాశం ఇస్తే పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగపడతారు ఇలా అనేక అంశాలతో జగన్ నిఘా వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుని ఆమేరకు మంత్రి పదవుల ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు.
జగన్ క్యాబినెట్ లో చోటు సంపాదించుకునేందుకు ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు, జగన్ వీరవిధేయులు చాలామంది కాచుకు కూర్చున్నారు.మొదటి విడతలో వారెవరికీ అవకాశం దక్కకపోవడంతో, మరో ఆరు నెలల లోపు ఏర్పాటు చేయబోయే కొత్త క్యాబినెట్ లో తమకు అవకాశం దక్కుతుందని ఎదురుచూపులు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే జగన్ మంత్రులకు గ్రేడింగ్ లను కేటాయించినట్లు తెలుస్తోంది.వాటిల్లో పెర్ఫార్మెన్స్ బాగున్న వారిని మాత్రమే మంత్రి పదవుల్లో కొనసాగించి, మిగిలిన వారిని తప్పించాలని చూస్తున్నారట.
ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో ఉన్న ముగ్గురు మహిళా మంత్రులకు నిరాశ తప్పదనే సంకేతాలు వైసీపీ నుంచి వస్తున్నాయి.