2024 ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.వైసీపీ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేయడమే ఏకైక లక్ష్యంగా తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాయి.
ప్రస్తుతం జనసేన బీజేపీ ల పొత్తు కొనసాగుతున్నా, ఎన్నికల నాటికి మాత్రం టిడిపి జనసేన పొత్తు ఖాయం అనేది విశ్లేషకుల అభిప్రాయం.ఇక తమ రెండు పార్టీలు కలిస్తే అధికారంలోకి రావడం అంత కష్టమేమీ కాదని, అప్పటికి జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరుగుతుందని , అధికారంలోకి తీసుకు వస్తామని, కలిసి ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు , కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టిడిపి ఆశపడుతోంది.జనసేన కనుక టిడిపితో పొత్తుకు ఒప్పుకుంటే దాదాపు 40 స్థానాలను కూడా జనసేన కు ఇచ్చేందుకు టిడిపి సిద్ధంగా ఉంది.
2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల జనసేన టిడిపిలు ఘోర పరాజయం పాలయ్యాయి.మళ్లీ అటువంటి తప్పు చేయకూడదని , ఆ రెండు పార్టీల అభిప్రాయం.అందుకే పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలనే ప్లాన్ తో ఉన్నాయి అనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా, తమకు ఎటువంటి డోకా ఉండదు అనేది వైసిపి అభిప్రాయం.దీనికి 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని వైసీపీ ఇప్పుడు ప్రస్తావిస్తోంది.2019 ఎన్నికల్లో టిడిపికి 39 శాతం ఓట్లు రాగా, వైసీపీకి 50 శాతం పైగా వచ్చాయి.ఇక జనసేన కు ఆరు శాతం ఓట్లు వచ్చాయి.
జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినా, 40 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని, అయినా గతంతో పోలిస్తే వైసిపి మరింత బలోపేతం అయిందని, ప్రత్యేక ఓటు బ్యాంకును సంపాదించుకుంది అని, జగన్ కు మళ్ళీ తిరుగు ఉండదని ఆ పార్టీ నాయకుల అభిప్రాయం.
ఇటీవల స్థానిక సంస్థలు ఎన్నికల్లోనూ వచ్చిన ఫలితాలు లెక్క చూసుకుంటే వైసీపీకి 64 శాతం, టీడీపీకి 25.2 శాతం, జనసేనకు 4.34 శాతం ఓట్లు వచ్చాయి .జెడ్ పి టి సి ఎన్నికలలో వై సి పి కి 69.55, టీడీపీకి 22.27, జనసేన కు 3.8 3 శాతం ఓట్లు వచ్చాయి.ఈ లెక్కలన్నీ చూసుకునే వైసిపి ధీమాగా ఉంది.అది కాకుండా జనసేన ప్రభావం కేవలం గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కాస్తోకూస్తో ఉంటుందని, రాయలసీమ వంటి ప్రాంతాల్లో అసలు ఏమాత్రం ప్రభావం చూపించలేదని , టిడిపి కి సైతం ఇదే పరిస్థితి ఉంటుందని, ఈ రెండు పార్టీలు కలిసినా, తమకు వచ్చే ముప్పు ఏమీ లేదనది వైసిపి అభిప్రాయంగా కనిపిస్తోంది.