వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి మండలిని జగన్ సరి కొత్తగా ఏర్పాటు చేశారు. సామాజిక వర్గాల వారీగా మంత్రుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది.
రాజకీయ అనుభవం పెద్దగా లేని వారు, కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు, రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా గుర్తింపు లేని వారు ఎంతోమంది జగన్ క్యాబినెట్ లో మంత్రులు గా కొలువు తీరారు.అయితే వీరందరికీ మంత్రి పదవులు ఇచ్చేందుకు మొదటి నుంచి తన వెంట నడిచిన వారిని జగన్ పక్కన పెట్టారు.
అప్పట్లోనే దీని పై సొంత పార్టీ లోనే అసంతృప్తులు చెలరేగినా జగన్ మాత్రం లెక్కచేయలేదు.అయితే కొత్త మంత్రి మండలిని ఏర్పాటు చేసిన సమయంలోనే రెండోసారి మంత్రివర్గ విస్తరణలో దాదాపు 90 శాతం మంది మంత్రులను తప్పించి, వారి స్థానంలో వేరొకరికి ఆ మంత్రి పదవులు ఇస్తాను అంటూ జగన్ ముందుగానే చెప్పేసారు.
దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతోంది.దీంతో కొత్త మంత్రిమండలిని ఎంపిక చేసేందుకు అప్పుడే జగన్ కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం.
దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల వ్యవహారాలు అన్నిటిపైనా జగన్ నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఉన్న మంత్రులలో చాలామంది పనితీరు పై జగన్ అసంతృప్తిగానే ఉన్నారు.
వారికి మంత్రి పదవులు ఇచ్చినా, పార్టీకి ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజనం కలగడం లేదని తమ సొంత శాఖలపై కూడా సంపాదించి లేని పరిస్థితుల్లో ఉన్నారని జగన్ అభిప్రాయపడుతున్నారట.అయితే కొత్త మంత్రుల ఎంపికలో సామాజిక వర్గాల వారీగా ఎంపిక ప్రక్రయను పూర్తి చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నారట.
ప్రస్తుతం ఉన్న మహిళా మంత్రులు సుచరిత, తానేటి వనిత , పుష్ప శ్రీవాణి లను సైతం తప్పించి వారి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మహిళలకు జగన్ మంత్రి పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్తగా ఎన్నికైన మంత్రులు ఎన్నికల వరకు ఉంటారు కాబట్టి, వారి ఎంపికలో జగన్ చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారట.కొత్త మంత్రివర్గం పై జగన్ కసరత్తు మొదలు పెట్టారు అనే విషయం లీక్ కావడంతో జగన్ తో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు, సీనియర్లు చాలామంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారట.ఇక ఎమ్మెల్సీలు సైతం ఈ మంత్రివర్గ విస్తరణ లో చోటు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, జగన్ మాత్రం తనకు అందిన నివేదికలు , నిఘా రిపోర్ట్ లు , పార్టీకి ప్రభుత్వానికి ఎవరు ఎంతగా ఉపయోగపడతారు అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.