చాలా రోజుల నుంచి వైసిపి ప్రభుత్వంలోని మంత్రులను జగన్ మార్చబోతున్నారని, వారి స్థానంలో లో కొత్త వారికి అవకాశం కల్పించబోతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే జగన్ మంత్రివర్గం లో మార్పు చేర్పులపై లీకులు ఇస్తూనే ఉన్నారు.
ప్రస్తుత మంత్రి వర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి , వంద శాతం మంత్రులను మార్చి, కొత్త వారికి అవకాశం కల్పించబోతున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది.దీనికి తగ్గట్లుగానే జగన్ అప్పట్లో సిమ్లా టూర్ కు వెళ్ళడం , అక్కడ కొత్త మంత్రి మండలి ఏర్పాటు విషయమై నిర్ణయం తీసుకోవడంతో పాటు, లిస్ట్ కూడా తయారు చేసుకున్నారనే ప్రచారం జరిగింది.
ఇక దీనికి తగ్గట్లుగానే ఏపీలో రాజకీయ వాతావరణం నెలకొనడంతో అదిగో ఇదిగో అంటూ విస్తరణపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి.దీనికి తగ్గట్లుగానే జగన్ బంధువు , సన్నిహితుడైన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం కొద్ది నెలల క్రితం మంత్రి వర్గ విస్తరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ వంద శాతం మంత్రివర్గ ప్రక్షాళన చేయబోతున్నారని , నాతో సహా మొత్తం మంత్రులందరినీ మార్చి వారి స్థానంలో కొత్త వారిని మంత్రులుగా తీసుకోబోతున్నారు అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.అయితే ప్రస్తుత పరిస్థితి సానుకూలంగా లేకపోవడం, ప్రజావ్యతిరేకత పెరుగుతున్న తీరు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత మంత్రిమండలి ని ఇప్పట్లో జగన్ మార్చే అవకాశమే లేదు అనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం మంత్రులందరినీ మార్చి కొత్తవారిని తీసుకుంటే , మళ్లీ వారు ఆయా శాఖల పై పట్టు సాధించేందుకు చాలా సమయం తీసుకుంటారని, ఆ ప్రభావం జనాల్లో అసంతృప్తికి కారణం అవుతుందని జగన్ అభిప్రాయపడుతున్నారు.అదీ కాకుండా ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్నవారిలో జగన్ అత్యంత సన్నిహితులైన వారు చాలా మంది ఉన్నారు.
ముఖ్యంగా మంత్రి కొడాలి నాని వంటి వారు టిడిపిని ఇరుకున పెట్టే విషయంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపడితే అటువంటి వారిని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.పరిస్థితులు కాస్త అనుకూలంగా మారే వరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం మంచిదనే సూచనలు సైతం జగన్ కు అందడంతో మరో ఆరు నెలలు వేచి చూడాలనే అభిప్రాయం లో జగన్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.అయితే ఈ పరిణామాలు మంత్రి వర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న జగన్ సన్నిహిత ఎమ్మెల్యేలకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది.