వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి.ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్నా, రాజకీయంగా స్పీడ్ పెంచినా వైసీపీకి ఈ నాలుగు నెలల కాలంలో అనుకున్నంత సానుకూలమైన ప్రజాభిప్రాయం అయితే దక్కలేదు.
జగన్ నిత్యం కీలక సమావేశాలు సమీక్షలతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశాలకు వెళుతూ బిజీబిజీగా గడుపుతున్నారు.ఇదే సమయంలో రాష్ట్రంలో వరదలు, విపత్తులు, పడవ ప్రమాదం ఇలా ఒకదానికి ఒకటి సమస్యలు వచ్చి మీద పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం జగన్ కు చాలా ఇబ్బందికరంగా మారింది.అందుకే పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు త్వరలో జగన్ కుటుంబం నుంచి ఒకరు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రస్తుతం పార్టీలో చర్చ నడుస్తోంది.
జగన్ తాను పాదయాత్ర లో ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు.విద్య ఉద్యోగాల కల్పన, పింఛన్లు తదితర వాటిని ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చారు.మిగతా హామీలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నారు.ఇటు పార్టీ అధ్యక్షుడిగా అటు ముఖ్యమంత్రి గారు జగన్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు.అందుకోసమే పార్టీ బరువు బాధ్యతలను జగన్ తగ్గించుకునేందుకు చూస్తున్నారు.ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఖాళీగా ఉంది.
ఆ పదవిలో తన సోదరి షర్మిలకు జగన్ అవకాశం ఇవ్వాలని అని భావిస్తున్నట్టు సమాచారం.అక్రమాస్తుల కేసులో జగన్ జైలు పాలైన ప్పుడు షర్మిల పాదయాత్ర చేసి పార్టీకి మంచి మైలేజ్ తీసుకువచ్చారు.
జగన్ స్థాయిలో షర్మిలకు కూడా జనాల్లో ఆదరణ పెరిగింది.ఆ తర్వాత ఆమెను తెలంగాణ వైసిపి అధ్యక్షురాలు చేయబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి.
కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్ళిపోయింది.
ఇక 2019 ఇది ఎన్నికల్లో షర్మిల వైసిపి మద్దతుగా ప్రచారం చేసి రాష్ట్రమంతా పర్యటించారు.టిడిపి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ప్రజలతో ఈలలు వేయించారు.ఆ ప్రచారం కూడా వైసిపి విజయానికి కొంతమేర ఉపయోగపడింది.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కుటుంబ సభ్యులు ఎవరు పార్టీలోకి, ప్రభుత్వంలోకి తీసుకు రాకూడదనే ఆలోచనతో షర్మిలను దూరంగానే ఉంచారు.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపి దూకుడు ప్రదర్శిస్తూ వైసీపీ మీద ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది.
దానికి విరుగుడుగా షర్మిలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం.