టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ సంఘటన జరిగినా, దానిని వదిలిపెట్టకుండా తన రాజకీయ ఎదుగుదలకు వాడుకోవడంలో లోకేష్ సక్సెస్ అవుతూ వస్తున్నారు.
చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ బాధ్యతలు మొత్తం లోకేష్ తీసుకోవాల్సి ఉండటంతో, ఇప్పటి నుంచే పార్టీ శ్రేణుల్లో ఆ నమ్మకాన్ని కలిగించేందుకు లోకేష్ గట్టిగానే కష్టపడుతున్నారు.దీనికోసం ప్రజల్లో వైసిపి ప్రభుత్వం తీసుకున్న ఏ ఏ నిర్ణయాలు తీవ్ర అసంతృప్తిని ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయో చూసుకుని, వాటిపైనే ఎక్కువ గా పోరాడుతూ, ప్రజలు బలం పెంచుకునేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా చూసుకుంటే లోకేష్ చేపడుతున్న నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు ఆయన అనుకున్న దానికంటే ఎక్కువగానే పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చాయి.
గతంలో వైసీపీ అధినేత జగన్ ఏ విధంగా అయితే పరామర్శ పేరుతో ఓదార్పు యాత్ర నిర్వహించారో అదే విధంగా లోకేష్ కూడా ఏపీ లో ఓదార్పు యాత్రలు నిర్వహిస్తున్నారు.ఇటీవల గుంటూరులో యువతి దారుణ హత్యకు గురికాగా, అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ వెళ్లారు.అయితే అనుకోకుండా వైసీపీ శ్రేణులు లోకేష్ పర్యటన ను అడ్డుకునేందుకు ప్రయత్నించడం, దీనిపై పెద్ద గందరగోళం చోటు చేసుకుంది.
అంతేకాదు ఈ వ్యవహారంలో లోకేష్ ను అరెస్టు చేయడం వంటివి ఆయనకు మైలేజ్ తీసుకువచ్చాయి.ఇక ఈ రోజు చూసుకుంటే, గుంటూరు జిల్లా నరసరావుపేట లో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చోటుచేసుకోవడంతో వారిని పరామర్శించేందుకు లోకేష్ గన్నవరం ఎయిర్ పోర్టులో దిగగానే, నరసరావుపేట వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద హైడ్రామా నడిచింది.అయితే లోకేష్ ఎక్కడ పర్యటించినా అడ్డుకోవడమే వైసీపీ ప్రభుత్వం లక్ష్యం అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో, అనుకోకుండానే లోకేష్ ఇమేజ్ అమాంతం పెరుగుతూ వస్తుంది.
చంద్రబాబు ఏ విధంగా అయితే లోకేష్ గ్రాఫ్ పెంచాలని అనుకుంటున్నారో, అదేవిధంగా వైసిపి ప్రభుత్వ విధానాల ద్వారా లోకేష్ గ్రాఫ్ పెరుగుతూ ఉండడం తో, ముందు ముందు ఈ పరిణామాలు అన్నీ ఇబ్బందికరంగానే మారేలా కనిపిస్తున్నాయి.