ఏపీలో జగన్ హవాకు పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.ఇక్కడ జగన్ చెప్పిందే వేదం అన్నట్టుగా పరిస్థితి ఉంది.
కానీ కేంద్రంలో మాత్రం జగన్ కు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.కేంద్రం తనకు అన్నిరకాలుగా అండదండలు అందిస్తుందనే ఉద్దేశంతోనే జగన్ తలకు మించిన భారం అయిన పథకాలన్నిటికి రూపకల్పన చేశాడు.
కేంద్ర ఇచ్చే నిధులతో ఏపీలో తాను ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించవచ్చని జగన్ భావించారు.కేంద్రం అండదండ తనకు తప్పనిసరిగా ఉంటాయనే బలమైన నమ్మకంతోనే జగన్ ఇంత ధైర్యంగా అడుగులు ముందుకు వేసాడు.
అయితే కేంద్ర అధికార పార్టీ బీజేపీ మాత్రం జగన్ విషయంలో ఎన్నికల ముందు అవలంబించిన ధోరణిని విడిచిపెట్టేసింది.జగన్ కూడా తమకు శత్రువే అన్నట్టుగా వ్యవహారాలు చేస్తోంది.
ఇదే ఇప్పుడు జగన్ కు మింగుడుపడడంలేదు.
కేంద్రంలో ఎంతగా చక్రం తిప్పితేనే రాష్ట్రానికి అంతగా నిధులు వస్తాయనేది నిజం.అందుకే ప్రతి రాష్ట్రం కూడా కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి.రాష్ట్ర పన్నుల్లో కేంద్రం నుంచి వాటాగా రావాల్సిన నిధుల విషయంలో జాప్యం లేకుండా రావాలన్నా, వివిధ పథకాలకు రీయింబర్స్మెంట్ రావాలన్నా, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాలు సక్రమంగా అందాలన్నా కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడం ఒక్కటే మార్గం.
గత చంద్రబాబు ప్రభుత్వం కూడా ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి ద్వారా లాబీయింగ్ చేస్తూ తమ హవాకు ఎక్కడా గండిపడకుండా చూసుకుంది.కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఆ విధంగా ముందుకు వెళ్లలేక ఇబ్బందిపడుతోంది.
గత టీడీపీ ప్రభుత్వంలో కేంద్ర అధికార పార్టీ బీజేపీతో వైరం ఉన్నా రాష్ట్రానికి గ్రామీణ సడక్ యోజన, జాతీయ రహదారుల అభివృద్ది నిధులు, ఏపీ ఫైబర్ నెట్, అందరికీ ఇళ్లు, ప్రధాని ఆవాస్ యోజన, అమృత్ వంటి పథకాలు సక్రమంగానే అందరికి అందాయి.కానీ, ఇప్పుడు జగన్ పరిస్థితి ఆ విధంగా లేదు.
వైసీపీకి ఎంపీల బలం ఎక్కువే ఉన్నా వారిలో ఎక్కువ మంది జూనియర్లు కావడం, కేంద్రంలోని కీలక నేతలతో పెద్దగా పరిచయాలు లేక పోవడంతో కేంద్రంతో లాబీయింగ్ చేయలేకపోతున్నారు.ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒక్కరు మాత్రమే అన్ని బాధ్యతలు మోస్తున్నాడు.ప్రధాని మోదీ దగ్గర విజయసాయిరెడ్డికి పలుకుబడి ఉన్నా అది పలకరింపుల వరకే పరిమితం అవుతోంది తప్ప ఏపీకి నిధులు, పథకాలు తీసుకొచ్చే విషయంలో ఏ మాత్రం ఉపయోగపడడంలేదు.పార్టీ తరపున ఏకంగా 22 మంది ఎంపీలు గెలిచినా టీడీపీ ఎంపీలుగా ఉన్న కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్నాయుడు రేంజ్లో అటు పార్టీ తరపున కానీ ఏపీ సమస్యలపై కానీ పార్లమెంటు వేదికగా బలమైన గళం వినిపించలేకపోతున్నారు.