ఏపీ అధికార పార్టీలో ఇప్పుడు నూతన ఉత్సాహం కనిపిస్తోంది.చాలా కాలం క్రితం పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టి కొంతమంది ఆశా వాహులను తృప్తి పరిచిన జగన్ ఇప్పుడు మళ్ళీ ఎన్నికల తంతు ముగియడంతో మరోసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
రాష్ట్ర జిల్లా స్థాయిలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులు అన్నిటినీ, ప్రాధాన్యం ప్రకారం భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారు.ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు మొత్తం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
జిల్లాల వారీగా రాష్ట్రస్థాయిలో ఎన్ని నామినేటెడ్ పదవులు ఉన్నాయనే లెక్కలు తెప్పించుకున్న జగన్ అందులో సామాజిక వర్గాల సమతూకం పాటించడంతో పాటు, సగం వరకు మహిళలతో నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పట్టణాల్లో పాలకవర్గాలు కూడా ఏర్పాటు కావడంతో పట్టణ అభివృద్ధి సంస్థల చైర్మన్ పదవులను భర్తీ చేసేందుకు జగన్ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నామినేటెడ్ పదవుల భర్తీ లో అర్హులను ఎంపిక చేసేందుకు ఇప్పటికే ఐదుగురు రీజియన్ ఇన్చార్జిల కు జగన్ బాధ్యతలు అప్పగించారు.అర్హులను ఎంపిక చేసే విషయంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పైన జగన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట.
ముఖ్యంగా ఈ నామినేటెడ్ పదవులు భర్తీ విషయంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నామినేటెడ్ పోస్టులు భర్తీ విషయంలో మొదటి నుంచి పార్టీకోసం కష్ట పడిన వారు, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోల్పోయిన వారికి, మేయర్, మున్సిపల్ చైర్మన్ , తదితర పదవులు ఆశించి భంగపడ్డ వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని మొదటి నుంచి కష్టపడిన నాయకులుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే కండిషన్ జగన్ పెట్టడంతో, వైసిపి లో సందడి వాతావరణం నెలకొంది.ఇప్పటి వరకు తమకు తగిన గుర్తింపు లేదని ఆందోళనలో ఉన్న నాయకులను ఈ నామినేటెడ్ పదవుల ద్వారా జగన్ సంతృప్తిపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
.