ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఏపీలోని 25 పార్లమెంట్ సీట్లలో దాదాపు 17 సీట్లు వైసీపీ ఖాతలో పడడం గ్యారంటీ అని బలంగా నమ్ముతున్న ఆ పార్టీ అధినేత జగన్ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న తమ మద్దతు అవసరమనే ఆలోచనలో ఉన్నాడు.ఒకవేళ ఏ పార్టీకి మద్దతు ప్రకటించాల్సి వచ్చినా ఒకటో రెండో మంత్రి పదవులు తీసుకుని తృప్తి పడటం కాదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎవరితోనైనా మనం జత కట్టేందుకు సిద్ధ పడాలి” ఇవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కీలక నాయకులు కొంతమంది దగ్గర వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం వైసీపీ సీనియర్ నాయకులతో దేశవ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ సరళిపై జరిగిన మీటింగ్ లో జగన్ ప్రత్యేక హోదాకు వైసీపీకి మద్దతు ఇస్తున్నట్టు, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎవరు ముందుకు వస్తే వారికే వైసీపీ మద్దతు ఇవ్వాలని ఈ సమావేశం లో నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు ఎంత కీలకమో, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా అంతే కీలకమని జగన్ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.ఈ సమావేశంలోనే కేంద్ర మంత్రి పదవులు తీసుకునే విషయం మీద కూడా చర్చ జరిగినట్టు సమాచారం.
తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తరువాత ఏపీలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయని, విభజన సమస్యల నుంచి ఏపీని గట్టెక్కిస్తామని చెప్పుకొచ్చిన టీడీపీ అధికారం చేతికొచ్చాక ఆ సంగతే మర్చిపోయిందని దాని కారణంగానే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కూడా జగన్ పార్టీ నాయకుల సమావేశంలో చర్చించారట.టీడీపీ పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకున్నారని , ఇప్పుడు ప్రజల ఆశలను తీర్చాల్సిన బాధ్యత మనమీద ఉందని చెప్పారట.ప్రస్తుతం కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా వైసీపీకి ఫర్వాలేదని, కాకపోతే ఏపీ సమస్యలు పరిష్కారం చేస్తాను అన్న పార్టీకే మద్దతు ఇవ్వాలని అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా మనకు అనవసరం అంటూ జగన్ వ్యాఖ్యానించాడట.