వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎంత మొండివాడో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేసే విషయంలో ఎన్ని అవాంతరాలు, ఎంత వ్యతిరేకత వచ్చినా జగన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తుంటాడు.
జగన్ రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుంచి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ ఏడు నెలల కాలంలో ఇదే విషయం ఋజువైయ్యింది.ఇక కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజధాని అమరావతి వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది.
విపక్షలు, రాజధాని రైతులు జగన్ తీరుపై మండిపడుతున్నారు.అమరావతి నుంచి రాజధానిని వేరు చేయవద్దు అంటూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు.
అయినా ఈ విషయంలో జగన్ వెనక్కి తగ్గేలా కనిపించకపోవడం అనేక విమర్శలకు కారణం అవుతోంది.
అమరావతి విషయం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుండడంతో దీనిపై జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా రాజధానిని విశాఖలో ఏర్పాటు చేసే విధంగా సరికొత్త ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.రాజధాని విషయంలో ఆదిలో వచ్చిన డిమాండ్పై తాజాగా హైపవర్ కమిటీ చర్చించినట్టు సమాచారం.
రైతులు నష్టపోతారనే వాదన వచ్చిన సమయంలో వారికి అన్యాయం చేయమని ప్రకటించిన మంత్రులు ఇప్పుడు ఆదిశగా మరింత క్లారిటీ ఇచ్చారు.గతంలో రైతుల నుంచి అప్పటి ప్రభుత్వం తీసుకున్న భూములకు బదులుగా ఇస్తామన్న డెవలప్డ్ ల్యాండ్ల విస్తీర్ణాన్ని మరింతగా పెంచాలని నిర్ణయం తీసుకున్నారట.
దీనిని మరో 200 గజాలకు పెంచుతూ హైపవర్ కమిటీ సిఫారసు చేసినట్టు సమాచారం.
ఇక కౌలు పెంచే విధంగా కమిటీ సిఫార్స్ చేసింది.ఇక రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడం దాదాపు ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో అత్యంత కీలకమైన అంశం ఉద్యోగుల తరలింపు.ఈ విషయంలోనూ హైపవర్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
విశాఖకు తరలివచ్చే ఉద్యోగులపై వరాల జల్లు కురిపించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది.రాజధాని తరలింపునకు ముందుగానే విశాఖలో ఉద్యోగులకు స్థలాలు ఇళ్లు కేటాయించాలని నిర్ణయించారు.
అలాగే పనిదినాలు వారానికి ఐదు రోజులకు కుదించడం, వారికి లోన్లు ఇప్పించడం ఇలా అన్నిరకాలుగా ఉద్యోగులను ఒప్పించి ముందుకు వెళ్లాలని చూస్తున్నారు.ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన జగన్ రాజధాని అంశంపైనే కీలకంగా చర్చించినట్టు, కేసీఆర్ సలహాలు ఈ విషయంలో తీసుకున్నట్టు తెలుస్తోంది.
.