ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఎక్కడ అలసత్వం అనేది కనిపించకుండా ఎప్పటికప్పుడు ఏపీ సీఎం జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, నిర్ణయాలు ఇలా దేనిలోనూ రాజీ అనేది లేకుండా జగన్ ప్రజల మద్దతు పూర్తిస్థాయిలో పొందే విధంగా చూసుకుంటున్నాడు.
తమ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఎవరు అవినీతికి పాల్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.దీనికోసం ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఏర్పాటు చేశారు.
ఎప్పటికప్పుడు మంత్రుల పనితీరు పైన జగన్ ఆరా తీస్తున్నారు.మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ శాఖ పై పూర్తి స్థాయిలో పట్టు సాధించి, తమ శాఖకు న్యాయం చేస్తున్నారా లేదా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.
జగన్ ఇప్పుడు మంత్రులకు ఓ పరీక్ష పెట్టినట్లు తెలుస్తోంది.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల తంతు ఈ నెలలోనే ఉండడంతో పార్టీ అభ్యర్థులు విజయం గురించి జగన్ మంత్రులకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.మంత్రులు తమ తమ జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ, స్థానిక సంస్థల అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని, మంత్రి నియోజకవర్గంలోనూ ఇంఛార్జిగా ఉన్న జిల్లాలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందింది అంటే దానికి పూర్తిగా బాధ్యత వహించాలని, వెంటనే రాజీనామా చేసేందుకు కూడా రెడీగా ఉండాలి అంటూ జగన్ కాస్త గట్టిగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా జగన్ ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.ఇది ప్రభుత్వ పనితీరుకు కూడా నిదర్శనంగా ఉండే అవకాశం ఉండడంతో జగన్ గెలుపు పై ఇప్పుడు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.ఒకవేళ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించకపోతే, దీనిని అవకాశంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ బలపడే అవకాశం ఉందని, దీని కారణంగా వైసిపి ప్రజల ఆదరణ కోల్పోతుంది అనే విషయాన్ని హైలెట్ చేసే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు.
అందుకే ఇంత ఘాటుగా హెచ్చరికలు చేసినట్లు అర్థమవుతోంది.మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పిటిసి, సర్పంచ్ లు ఇలా అన్ని పదవుల్లోనూ వైసిపి మద్దతుదారులు విజయం సాధించాలని జగన్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఎమ్మెల్యేలు కూడా జగన్ ఇదే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.మరి జగన్ వార్నింగ్ లు ఎంతవరకు పని చేస్తాయో చూడాలి.