ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించి అప్పుడే రెండేళ్లకు దగ్గరవుతోంది.అప్పటి నుంచి ఇప్పటి వరకూ జగన్ తీరికలేకుండా గడుపుతూనే ఉన్నారు.
వివిధ సంక్షేమ పథకాలు అమలు తీరుపై అధికారులతో సమీక్షలు , కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నో అంశాలపై జగన్ తీరిక లేకుండా గడుపుతున్నారు.వైసీపీ ప్రతిపక్షం లో ఉండగా జగన్ నిరంతరం ప్రజలమధ్య ఉంటూ, పాదయాత్రలు, బస్సు యాత్రలు చేస్తూ, ఏదో ఒక హడావుడి చేస్తూ జగన్ జనాల్లో కనిపించేవారు.
అయితే ఇప్పుడు అంత తీరిక జగన్ కు లేదు.దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ, ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది అనే విషయం జగన్ కు స్పష్టత లేకుండా పోయింది.
దీనికి తోడు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల పనితీరుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడం , జనాల్లో ప్రభుత్వ ప్రతిష్ట తగ్గుతూ ఉండటం వంటి ఎన్నో కారణాలతో జగన్ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.ఈ మేరకు ఏప్రిల్ 13వ తేదీ నుంచి రచ్చబండ కార్యక్రమానికి జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ వ్యవహారంపై అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.రచ్చబండ కార్యక్రమం ద్వారా జనాల్లో ప్రభుత్వం పై ఉన్న అభిప్రాయం ఏంటి ? వైసీపీ ఎమ్మెల్యేలు, అధికారుల పనితీరు , అలాగే ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రభుత్వం ఇంకా ఏయే అంశాలపై ఫోకస్ పెట్టాలి అనే విషయాలపైన జగన్ ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకునేందుకు సిద్దమవతున్నారట.ఇక ఈ రచ్చబండ కార్యక్రమం ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపైన జగన్ ఆలోచన చేస్తున్నారు.కడప నుంచి ప్రారంభించాలా లేక శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించాలా అనే దానిపై కసరత్తు జరుగుతోందట.
ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో జగన్ తెలుసుకోబోతుండడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన పెరిగిపోతుంది.ఇప్పటికే వివిధ సర్వేల ద్వారా ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వార్నింగ్ ఇస్తున్న జగన్ ఇప్పుడు రచ్చబండ కార్యక్రమం ద్వారా తమ పై మరింత గా ఫోకస్ పెడతారేమో అనే ఆందోళన వైసీపీ ఎమ్మెల్యే ల్లో పెరిగిపోతోందట.