ఎన్నికల ఫలితాలు ఇంకా రాలేదు, ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందో తెలియదు, అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదు.అయినా అప్పుడు తాము అధికారంలోకి వచ్చేసినట్టు, కీలకమైన పదవుల్లో తమను కూర్చోబెట్టిసినట్టు వైసీపీ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తెగ హడావుడి చేసేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఇది మరీ శృతిమించడంతో వైసీపీ అధినేత జగన్ నేరుగా రంగంలోకి దిగి నాయకులకు గట్టిగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.కొంతమంది నాయకుల వ్యవహారం మరీ ఓవర్ అయినట్టు ప్రజల్లో చర్చ కూడా నడుస్తోంది.
కొంతమంది జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారనీ, ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు పెట్టేసుకున్నారనీ, చివరికి మంత్రులుగా కొంతమంది జాబితా తయారైపోయిందంటూ ప్రచారం మొదలెట్టేశారు.
ఈ ఎన్నికల్లో తప్పకుండా తమ పార్టీనే అధికారంలోకి వస్తుంది అన్న ధీమా ఎక్కువ అవ్వడంతో వైసీపీ నాయకులు హడావుడి ఎక్కువ చేస్తున్నారు.
తమ అధినాయకుడే కాబోయే ముఖ్యమంత్రి, మా నాయకుడే కాబోయే మంత్రి అంటూ కొన్ని నియోజక వర్గాల్లో వైసీపీ శ్రేణులు తీవ్ర ప్రచారం చేస్తుండటం, వాటిని సదరు నాయకులు ఖండించకపోవడం విమర్శలపాలవుతోంది.క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ వ్యవహారం కాస్తా జగన్ దృష్టికి చేరడంతో ఆయన అసహనం వ్యక్తం చేసాడట.
అంతే కాదు జిల్లాలకు చెందిన పార్టీ ఇన్ ఛార్జ్ లను తాజాగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కి పిలిపించినట్టు తెలుస్తోంది.ఆ సమావేశంలోనే కాబోయే మంత్రులు అంటూ కొంతమంది నాయకుల అనుచరుల చేస్తున్న ప్రచారం ప్రస్థావనకి వచ్చిందట!
ఎన్నికల ఫలితాలకు ఇంకా సమయం ఉంది.ఈ లోపున మంత్రి, ముఖ్యమంత్రి అంటూ హడావుడి చేయడం వల్ల మీడియాలోనూ, ప్రజల్లోనూ చులకన అవుతామని, ఇకపైన ఇటువంటి ప్రచారానికి ఆస్కారం ఇవ్వకుండా సైలెంట్ గా ఉండాలని ఆయా ఇంచార్జిలకు జగన్ క్లాస్ పీకాడట.మంత్రివర్గం ఏర్పాట్లపై, తాను సీఎంగా ప్రమాణ స్వీకారం గురించి ఎటువంటి ప్రకటనలు చేసినా సీరియస్ గా చర్యలు ఉంటాయని జగన్ వార్నింగ్ ఇచ్చాడట.
అంతే కాదు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఎలాగూ జరగాల్సిన తతంగం జరుగుతుందని ఈ లోపు హడావుడి మానుకోవాలని హితవు పలికినట్టు తెలుస్తోంది.