ఏదో ఒక రకంగా పార్టీని మరింత బలోపేతం చేసి, 2024 ఎన్నికల్లోనూ వైసీపీ జెండాను రెపరెపలాడించాలి అనే విధంగా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు.అందుకే ఇప్పటి నుంచే ఎక్కడా ఏ విషయంలోనూ రాజీ పడకుండా, అన్ని వ్యవహారాలను చాకచక్యంగా చక్కబెట్టుకుంటూ, పారదర్శకంగా ప్రభుత్వం పని చేస్తుందనే అభిప్రాయం జనాల్లో కలిగిస్తున్నారు.
ఇక సంక్షేమ పథకాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కేవలం ఏపీలోనే కాకుండా, దేశవ్యాప్తంగా జగన్ తన పరిపాలనపై చర్చ జరగాలనే విధంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.
దీంతోపాటు, ఒక్కో సందర్భంలో తమపై కత్తులు నూరుతున్న కేంద్ర అధికార పార్టీ బీజేపీతోనూ, సఖ్యతగా మెలుగుతూ, తనకు ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటూ, జగన్ వ్యవహారం నడిపిస్తున్నారు.ముందు ముందు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో తమకు ఇబ్బందులు తప్పవని గ్రహించి జగన్ ఆ పార్టీని బలహీనం చేసేందుకు అన్ని రకాలుగానూ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను వైసీపీకి అనుబంధంగా కొనసాగేలా చేస్తూ, టీడీపీకి రాజీనామా చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఇప్పటికే ఆ విధంగా నలుగురు ఎమ్మెల్యేలు వైసిపి వైపు నిలబడగా, మరికొంతమంది ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
దీంతో టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా సైతం పోగొట్టే విధంగా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.ఇక నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగలిగిన నాయకులందరినీ ఇప్పుడు వైసీపీలోకి చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇంతవరకు బాగానే ఉన్నా, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతర పార్టీలోని నాయకులూ వైసీపీలో చేరే విషయంలో పేచీ పెడుతున్నారు అని, ఇతర పార్టీల్లోని బలమైన నాయకులు వచ్చి చేరితే, రానున్న రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తు కు ఇబ్బంది ఏర్పడుతుందని, ఇలా ఎన్నో లెక్కలు వేసుకుంటున్నారు.చేరికలకు ఈ విధంగా అడ్డుపడుతున్నారనే విషయాలు జగన్ వరకు వెళ్లాయి.పార్టీ బలోపేతానికి, టిడిపిని బలహీనం చేసే కార్యక్రమానికి తాను శ్రీకారం చుడితే, పార్టీ నాయకులు తన తాపత్రయం అర్థం చేసుకోకుండా, తన నిర్ణయాలకు అడ్డుపడుతున్నారనే అభిప్రాయం జగన్ లోనూ ఉంది.ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఈ విషయమై అధిష్టానం పెద్దలు గట్టిగానే క్లాస్ పీకారట.
అయినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో, మరోసారి ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని, జగన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.