ఏపీ శాసనమండలి రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.మొదటి నుంచి ప్రతి విషయంలోనూ తమకు ఇబ్బందిగా మారిన ప్రతి అంశాన్ని చక్క దిద్దుకుంటూ వస్తున్న జగన్ తాను అనుకున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అయితే దీనికి శాసనసభలో తమకున్న మెజార్టీ సభ్యుల ద్వారా ఆమోదం పొందేలా చేసుకుని శాసనసభలో బిల్లు పాస్ చేయించుకుంటున్నారు జగన్.కానీ శాసన మండలికి వచ్చేసరికి బలం తక్కువగా ఉండడంతో అక్కడ టిడిపి సభ్యులు ఆ బిల్లును వ్యతిరేకించడం ద్వారా ప్రతి బిల్లు శాసన మండలిలో పెండింగ్ లో పెట్టేస్తున్నారు.
తాజాగా మూడు రాజధానులు, సి ఆర్ డి ఎ రద్దుపై నిర్ణయం తీసుకున్నా, శాసనమండలిలో ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి మండలి చైర్మన్ పంపిస్తూ నిర్ణయం తీసుకోవడం జగన్ కు ఆగ్రహం కలిగించింది.ఇక అప్పటి నుంచి ఏపీ శాసనమండలి అవుతుందని ప్రచారం జరిగింది.కానీ మండలి ఇంత స్పీడ్ గా రద్దు చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారు.మండలిలో తమకు మెజారిటీ లేదు కాబట్టి ఇక ముందు ముందు కూడా ప్రతి బిల్లును టిడిపి అడ్డుకుంటుందని, దాని ద్వారా తన నిర్ణయాలు ఏవి అమలు కావు అనే ఉద్దేశంతో జగన్ మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించుకున్నారు.
దీనిపై టిడిపి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తోంది.ఇప్పటికే తమ శాసన మండలి సభ్యులను వైసీపీ ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని ఆరోపిస్తూ వచ్చిన టిడిపి కి నిజంగా ఇది పెద్ద షాక్ ఇచ్చే అంశం.దీనిపై రాజకీయంగా తీవ్ర స్థాయిలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది.అది కాకుండా జగన్ నిర్ణయం పై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.ఎందుకంటే గత కొంతకాలంగా వైసిపి ప్రభుత్వ వ్యవహారం పై విమర్శలు చేస్తూ వస్తున్న బిజెపి మండలి రద్దుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.