చాలా విషయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఈ ఇద్దరికీ పోలికలు వస్తూ ఉంటాయి.దాదాపుగా వీరిద్దరూ ఒకే అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తారు.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణను భారీ వరదలు ముంచెత్తాయి.ప్రజలు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముందుకు వస్తున్నా, ఇంకా సాయం కోసం ఎదురు చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే వస్తోంది.ఈ నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న హైదరాబాదు ప్రజలను ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇవ్వాలంటూ కేసీఆర్ స్వయంగా విజ్ఞప్తి చేయడంతో, పెద్ద ఎత్తున సినీ స్టార్లు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు అంతా తమకు తోచిన విధంగా విరాళాలను ప్రకటిస్తూ వస్తున్నారు.
గతంలోనూ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలను ఆదుకునేందుకు విరాళాలు ఇవ్వాలంటూ కేసీఆర్ కోరారు.అప్పుడు భారీ ఎత్తున విరాళాలు తెలంగాణ ప్రభుత్వానికి అందాయి.
ఇది ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంతో మేలు కలిగించే అంశం.అయితే ఇక్కడ ఏపీ లో కూడా భారీ ఎత్తున వరదలు ముంచెత్తాయి.
జన జీవితాన్ని అతలాకుతలం చేశాయి.ప్రభుత్వం తరఫు నుంచి వారికి కొంతమేర నిధులు అందుతున్నా, భారీగానే సహాయం అందాల్సి ఉంది.
ఈ సమయంలో విరాళాలు ఇవ్వాల్సిందిగా ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి చేసి ఉంటే, తెలంగాణ మాదిరిగా ఏపీ ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా జగన్ అడిగేందుకు ఇష్టపడడంలేదు. జగన్ ఇక్కడ కూడా మొహమాట పడుతూ, విరాళాలు అడిగితే ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే చులకన భావం ఏర్పడుతుంది అనే భయం ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ, జగన్ విరాళాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.
ఇప్పటికే ఏపీలో సంక్షేమ పథకాలు కారణంగా ఆర్థిక లోటు తీవ్రంగా ఉంది.జగన్ విరాళాలు ఇవ్వాల్సిందిగా పిలుపు ఇచ్చి ఉంటే, భారీ ఎత్తున విరాళాలను ఇచ్చేందుకు ఎంతో మంది ముందుకు వస్తారు.
కానీ జగన్ మాత్రం ఆ విధంగా చేసేందుకు ఇష్టపడకపోవడంతో ఎవరూ ఏపీని ఆదుకునేందుకు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.