పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ, ఎక్కడ అవినీతి అనేది చోటుచేసుకోకుండా చేయాలనే లక్ష్యంగా మొదటి నుంచి జగన్ అడుగులు వేస్తున్నారు.అధికారులు, సొంత పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ దశలోనూ అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు, మిగతా అన్ని రంగాల్లోనూ అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలనే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తూ వస్తున్నారు.
గ్రామస్థాయిలో వాలంటరీ వ్యవస్థ తీసుకువచ్చి అధికారులు, ప్రజాప్రతినిధుల జోక్యం పెద్దగా లేకుండానే, ప్రజలకు సక్రమంగా అన్నిటినీ అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు.ఇదిలా ఉంటే ఎన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో నాయకులు అవినీతికి పాల్పడుతున్నారనే విషయం జగన్ వరకు వెళ్ళింది.
ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వ్యవహారాలపై నిఘా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.ఏపీ ఇంటిలిజెన్స్ తో పాటు, జగన్ కు అత్యంత సన్నిహితుడైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి సన్నిహితమైన కొంతమంది క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై ఒక నివేదికను జగన్ కు అందించినట్లు తెలుస్తోంది.
కొంతకాలంగా ఇసుక, మద్యం వ్యవహారాలు ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.వైసీపీ నాయకులు ఇసుక అమ్ముకుంటున్నారని , మద్యం వ్యవహారాల్లో కోట్లాది రూపాయలు వెనుకేసుకుంటున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో, అసలు క్షేత్ర స్థాయిలో నాయకుల వ్యవహారాలపై నిజాలు నిగ్గు తేల్చాలనే అభిప్రాయంతో జగన్ నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం.
పూర్తిస్థాయిలో నాయకుల వ్యవహారాలకు సంబంధించిన రిపోర్ట్ అందగానే, అవినీతి వ్యవహారాలకు పాల్పడుతున్న నాయకులను పిలిచి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలనే అభిప్రాయంలో ఉన్నారట.కాకపోతే ఈ విషయం బయటకు పొక్కకుండా అంతర్గతంగానే వివరాలను రాబట్టాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాల్లో అవినీతికి పాల్పడుతున్న నాయకుల వివరాలు పూర్తిగా తెప్పించుకున్న తర్వాత, జిల్లా ఇంచార్జి మంత్రులు, పార్టీ పరిశీలకుల ద్వారా వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పించాలని జగన్ డిసైడ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.