పాలనా పరంగా అన్ని విషయాల్లోనూ పైచేయి సాధిస్తూ ఉన్నామనే సంతృప్తి ఏపీ సీఎం జగన్ లో బాగా కనిపిస్తోంది.అయితే అదే సమయంలో పార్టీలో చోటుచేసుకుంటున్న అంశాలు జగన్ కు ఇబ్బంది తెప్పిస్తున్నాయి.
ముఖ్యంగా నాయకుల్లో సమన్వయం లేకపోవడం, ఆధిపత్యపోరు, అవినీతి వ్యవహారాలు ఇలా ఎన్నో అంశాలు ఇబ్బందికరంగా మారాయి.ప్రభుత్వ పరంగా అన్నిటిని ఒక గాడిన పెడుతూ వస్తున్న జగన్, పార్టీని మాత్రం గాడిలో పెట్టేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నా, ఆయన ప్రయత్నాలు వృధా గా మిగిలిపోతున్నాయి.
దీంతో పార్టీలో కీలక నాయకుల ద్వారా మిగతా నాయకులందరినీ క్రమశిక్షణలో పెట్టాలని చూస్తున్నా, ఫలితం మాత్రం కనిపించడం లేదు.
ఇప్పటికే పార్టీని మూడు ప్రాంతాలుగా విభజించి, ఒక్కో ప్రాంతానికి ఒక్కో కీలక నాయకుడుని నియమించారు.
ఉత్తరాంధ్ర జిల్లాలకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, కోస్తా ప్రాంతానికి జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి , రాయలసీమ ప్రాంతానికి సజ్జల రామకృష్ణా రెడ్డి లను జగన్ నియమించారు.వీరి ద్వారా పార్టీ నాయకులు అందరిని క్రమశిక్షణలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయినా, నిత్యం ఏదో ఒక తలనొప్పి వస్తూనే ఉంది నాయకుల వ్యవహారాల కారణంగా ప్రభుత్వానికి అప్రదిష్ట రావడంతో పాటు ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు క్రెడిట్ మొత్తం దెబ్బతినేలా కనిపిస్తుండడంతో, ఇక పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు.ఈమేరకు ఏపీలో పార్టీ పరిస్థితుల పైన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, ఇలా అనేక అంశాలను తెలుసుకునేందుకు సర్వేకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
అన్ని విషయాలను సమగ్రంగా తెలుసుకుని, దానికి అనుగుణంగా మార్పుచేర్పులు చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారట.
ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది ఇక ఆ తర్వాత ఉప ఎన్నికలు కూడా వచ్చే ఛాన్స్ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఉండటంతో ప్రభుత్వ పరంగా ఎక్కడా లోపాలు లేకుండా చూసుకుంటూ వస్తున్నారు.
అదే సమయంలో పార్టీని గాడిలో పెట్టేందుకు జగన్ నడుంబిగించినట్టు కనిపిస్తున్నారు.ఈ సర్వే లో వచ్చిన ఫలితాల ఆధారంగా, పార్టీలోని కీలక నాయకులు అందరితోనూ సమావేశం నిర్వహించాలని, అలాగే నియోజకవర్గ స్థాయిలోనూ నాయకులందరినీ సమావేశపరిచి పార్టీ కీలక నాయకులతో వారికి క్లాస్ పీకించాలి అని, అవసరమైతే కొంతమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా జగన్ వెనుకాడకూడదు అన్నట్టుగా, జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
అందుకే ఇక అన్ని విషయాల పైనా, ఒక క్లారిటీ కి వచ్చే అవకాశం కోసం జగన్ ప్రయత్నిస్తున్నారు.దీనికితోడు, ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి, ఆ పార్టీ గతంతో పోలిస్తే బలం ఉందా లేదా ? వైసిపి టీడీపీ ఈ రెండిటి విషయాల్లో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది ? ఇలా అనేక అంశాలపై సర్వేల ద్వారా తెలుసుకుని జగన్ ముందుకు వెళ్లేందుకు తగిన ప్రణాళికలు రచించిన్నట్లుగా, ఆ పార్టీలోని కీలక నాయకుల మధ్య చర్చ జరుగుతోంది.