ఏపీలో అధికార వైసీపీలో పదవుల కోసం ఆరాట పడే నేతలు చాలా మందే ఉన్నారు.ఆ మాటకు వస్తే ఇప్పటికే అక్కడ 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్సభ ఎంపీలతో పాటు పలువురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు.
ఇక జగన్ హామీలు ఇచ్చిన నేతలకు కొదవే లేదు.జగన్ గత ఎన్నికలకు ముందు సీట్ల త్యాగాలతో పాటు ఇతర త్యాగాలు చేసిన నేతలు ఎంతో మంది ఉన్నారు.
వీరిలో చాలా మంది ఎమ్మెల్సీలు ఇస్తామని హామీలు ఇచ్చారు.ఇవన్నీ ఇలా ఉంటే ఇక పార్టీలో చాలా మంది అధికార ప్రతినిధులు ఉన్నారు.
వైసీపీలో ఉన్న అధికార ప్రతినిధులకు లెక్కే లేదు.సహజంగానే ఏ రాజకీయ పార్టీకి అయినా తమ విధివిధానాలు ప్రకటించుకోవడానికి, అధికారికంగా అన్ని విషయాలపై చర్చించేందుకు అధికార ప్రతినిధులు ఉంటారు.
జాతీయ పార్టీల నుంచి, రాష్ట్ర పార్టీల వరకు అధికార ప్రతినిధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి.ముఖ్యంగా మీడియా చర్చల విషయంలో అధికార ప్రతినిధుల పాత్ర కీలకం.
అయితే ఏపీలో అధికార వైసీపీ మాత్రం అధికార ప్రతినిధుల పదవులను ఎత్తి వేయాలని చూస్తోందట.ఇకపై పార్టీ తరపున భవిష్యత్తులో అధికార ప్రతినిధులను నియమించకూడదన్న ఆలోచనలో ఉందని తెలుస్తోంది.
ఇకపై వైసీపీలో అధికార ప్రతినిధులు ఎవ్వరూ ఉండరని… పార్టీ విషయాలను వెల్లడించేందుకు కొంత మంది నాయకులకు బాధ్యతలు మాత్రమే అప్పగిస్తారని పార్టీ నేతల ద్వారా సమాచారం లీక్ అయ్యింది.
పార్టీలో అధికార ప్రతినిధి అనే పదవి వల్ల ప్రొటోకాల్, ఇతరత్రా విషయాల్లో అనేక సమస్యలు వస్తున్నాయన్న ఫిర్యాదులు జగన్కు వెళ్లాయి.కొందరు ఈ పదవులను అడ్డు పెట్టుకుని ఫైరవీలు చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారట.మరి కొందరు ఈ పదవితో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారట.
ఈ గొడవలకు చెక్ పెట్టేందుకే ఇక భవిష్యత్లో అధికార ప్రతినిధులను నియమించరని పార్టీ నాయకుల్లో ప్రచారం జరుగుతోంది.మరి ఈ పదవులు లేకపోతే పార్టీలో ఇప్పటికే ఉన్న అసమ్మతి, అసంతృప్తులు పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు.