వివాదాలకు దూరంగా ఉందామని ఎంతగా ప్రయత్నిస్తున్నా, వైసీపీ ప్రభుత్వంకు ఎప్పుడూ వివాదాలే చుట్టుముడుతూ ఉన్నాయి.ఏదో ఒక రకంగా, ఏదో ఒక అంశంలో ఏపీ ప్రభుత్వం అభాసుపాలవుతూ వస్తోంది.
ఇప్పటికే క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది.ఇప్పటి వరకు సంక్షేమ పథకాలతో ప్రజల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న జగన్ సొంత పార్టీ నాయకుల తప్పిదాల కారణంగా, ప్రజల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన భూముల కొనుగోలు వ్యవహారం, ఇలా అనేక విషయాల్లో పెద్దఎత్తున వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు, నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండడంతో జగన్ వారిని స్వయంగా పిలిచి కట్టడి చేయడం జరుగుతూ వస్తున్నాయి.
సరిగ్గా ఇదే సమయంలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధం అవ్వడం, ప్రతిపక్షాలన్నీ వైసీపీ ప్రభుత్వం పై మూకుమ్మడిగా దాడి చేయడంతో పాటు, జగన్ కు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలు చేశాయి.
అదే సమయంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చెందిన వెండి రథానికి ఉండే మూడు సింహాలు మాయమవడం, ఇలా ఎన్నో పరిణామాలు వైసీపీని చుట్టుముట్టాయి.దీంతో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ రావును ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి.
కొంతకాలంగా వెల్లంపల్లి వ్యవహారాలపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న తరుణంలో, ఇప్పుడు దేవాలయాల అంశం కూడా తెరపైకి వచ్చింది.
ఆయనను రాజీనామా చేయాలంటూ పెద్దఎత్తున ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇవే కాకుండా, సింహాచలం ట్రస్ట్ వ్యవహారం, తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద అన్యమత ప్రచారం, ఇలా ఒకటి కాదు రెండు కాదు, హిందుత్వం విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.బీజేపీ సైతం హిందుత్వం విషయంలో వైసిపిని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తోంది.
ముఖ్యంగా విజయవాడ సంఘటన వ్యవహారంలో మంత్రి వెల్లంపల్లి చెప్పిన సమాధానాలు వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.
ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి .ఈ నేపథ్యంలో ఆయనపై జగన్ ఆగ్రహంగా ఉన్నారని, ఆయనను ఆ పదవి నుంచి తప్పిస్తారు అనే ప్రచారం జరుగుతోంది.ప్రతిపక్షాలు మరింతగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకముందే ఆ మంత్రి పదవి నుంచి వెల్లంపల్లిని తప్పిస్తే తప్ప, ఈ వివాదాలు చుట్టుముడుతున్నాయనే అభిప్రాయం జగన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.