ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల సందడి నెలకొంది.ఎక్కడ చూసినా పాదయాత్రలు, బస్సు యాత్రలు, గడప గడపకు వెళ్తూ తమ పార్టీ గొప్పతనాన్ని చెప్పుకుంటూ తమకే ఓటు వేయాలంటూ జనాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు.
2024 ఎన్నికల్లో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో, ఇంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు జనాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.ఇప్పటికే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్రను మొదలుపెట్టారు.
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.మరోవైపు ఏపీ అధికార పార్టీ వైసిపి గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వినూత్నంగా ప్రజల వద్దకు వెళుతూ , ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందిన పథకాల లబ్ది అన్నిటిని వివరించే ప్రయత్నం చేస్తోంది.
ఇదిలా ఉంటే టిడిపి, జనసేన , బిజెపి వంటి పార్టీలు పూర్తిగా వైసిపిని టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, తమ అనుకూల మీడియాలోనూ ప్రభుత్వ వ్యతిరేక కథనాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తుండడంతో, వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ అలర్ట్ అయ్యారు.ఈ క్రమంలోనే పాదయాత్ర బస్సు యాత్రలకు పోటీగా పల్లెనిద్ర చేపట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లోని పల్లెల్లో స్వయంగా జగన్ పల్లె నిద్ర చేపట్టి అక్కడి సమస్యలను తెలుసుకోవడం ద్వారా జనాలకు దగ్గర కావచ్చని , వైసిపి ప్రభుత్వం పైన జనాల్లో క్రేజ్ పెరుగుతుందని జగన్ భావిస్తున్నారట .
ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు తమ గ్రామంలో బస చేస్తే ఆ ప్రభావం ఏపీ అంతటా కనిపిస్తుందని, టిడిపి, జనసేన లు చేపట్టిన పాదయాత్రలు , బస్సు యాత్రల ప్రభావం తగ్గుతుందని, జనాలు తన పల్లెనిద్ర పైనే ఎక్కువగా ఫోకస్ పెడతారని జగన్ ఆలోచిస్తున్నారట.ఈ మేరకు త్వరలోనే పల్లె నిద్ర కు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తున్నారట
.