వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల చిచ్చు మెల్లి మెల్లిగా రాజుకుంటోంది.తమకు తప్పకుండా మంత్రి పదవులు దక్కుతాయని ఆశపడ్డవారు చివరికి ఆ పదవులు దక్కకపోవడంతో ఢీలా పడ్డారు.
జగన్ క్యాబినెట్ లో ఎవరికి మంత్రి పదవి దక్కినా దక్కకపోయినా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు బెర్త్ ఖాయం అని అంతా అనుకున్నారు.కానీ ఆమెకు ఏ పదవి దక్కకపోవడంతో కారణం ఏమై ఉంటుంది అని అంతా ఆలోచనలో పడ్డారు.
ఇంతకీ జగన్ రోజాకు ప్రాధాన్యం కల్పించకపోవడం వెనుక కారణం కూడా ఉందట.ముందుగా ఆమెకు జగన్ పిలిచి ఒక ఆఫర్ ఇచ్చాడని, అయితే ఆ ఆఫర్ ఆమెకు నచ్చకపోవడంతో జగన్ మరో మార్గం లేక ఆమెను పక్కనపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు ప్రభుత్వంలో రోజాను ఏకపక్షంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారు.సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు.అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు.అందుకే చంద్రబాబు ద్వారా అధ్యక్షా అని పిలిపించుకునేందుకు రోజాకు స్పీకర్ పదవి ఇస్తున్నారనే చర్చ నడుస్తోంది.
జగన్ కూడా తన పార్టీ మహిళా నాయకురాలికి జరిగిన అవమానానికి సమాధానంగా రోజాకు స్పీకర్ పదవి ఇవ్వాలని భావించి రోజాను పిలిపించి ఆ విషయం చెప్పారట.అయితే రోజా మాత్రం తాను స్పీకర్గా ఉండలేను అంటూ తాను ఎక్కువగా ప్రజల్లో ఉండాలని భావిస్తున్నా అంటూ చెప్పి తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరారట.
అయితే అదే చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి తప్పకుండా అవకాశం కల్పించాల్సి రావడంతో రోజాను పక్కనపెట్టారట.ఎందుకంటే రామచంద్ర రెడ్డి మొదటి నుంచీ వైసీపీకి ఆర్థికంగా, రాజకీయంగా అండగా నిలిచారు.ఆయనకు మంత్రి పదవితో పాటూ… కీలక శాఖ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.అదే సమయంలో రోజాకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందేనని జగన్ భావిస్తున్నారు.రోజా మాత్రం మంత్రి పదవి కావాలని ఇంతవరకూ తాను అడగలేదనీ, పార్టీ కోసం తాను ఎంతగా కష్టపడ్డానో జగన్కి తెలుసని ఆయనే తగిన ప్రాధాన్యం కల్పిస్తారని ఆమె ధీమాగా చెబుతున్నారు.