కొద్ది రోజులుగా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అనుకూల పవనాలు వీస్తున్నట్లుగా కనిపించడం లేదు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్న మాటే గాని ఆ పార్టీని గెలిపించిన కార్యకర్తలకు నాయకులకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు అన్న మాటలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.
కిందిస్థాయి కార్యకర్తల నుంచి మంత్రుల వరకు ఇదే తీరు కనిపిస్తుంది.జగన్ ఏది చేసినా అది పార్టీ లోనే కాదు ప్రజల్లోనూ తీవ్రమైన అసంతృప్తికి కారణం అవుతోంది.
వరుస వరుసగా వస్తున్న వడిదుడుకులతో ఇబ్బందులకు గురవుతున్న జగన్ ఇప్పుడు పార్టీ నాయకుల్లో చెలరేగిన ఈ అసంతృప్తిని ఎలా చల్లార్చాలా అనే సందిగ్ధంలో పడిపోయాడు.తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ధర్మకర్తల మండలి సభ్యుల నియామకం జగన్ చేపట్టారు.
అది కాస్తా పార్టీలో అసంతృప్తిని రేపుతోంది.
టీటీడీ బోర్డు లో ఇరవై ఎనిమిది మంది వరకు సభ్యులను నియమించారు.ఆ బోర్డు లో ఏపీ కి సంబంధించిన వారు తక్కువగా ఉండడంతో అసంతృప్తికి కారణంగా కనిపిస్తోంది.పాలకమండలిలో ఎక్స్ అఫిషియో సభ్యులు నలుగురు కాగా మిగతా 24 మందిలో ఏపీకి చెందిన వారు ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు.
తెలంగాణ నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, ఢిల్లీ నుంచి ఒకరు, మహారాష్ట్ర నుంచి ఒకరు చొప్పున బోర్డులో స్థానం కల్పించారు.అయితే దీంట్లో ఏపీలోని నాయకులను మినహాయిస్తే మిగతా 16 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారే కనిపిస్తున్నారు.
టీటీడీలో స్థానం దక్కడం అంటే చాలా అదృష్టంగా భావిస్తుంటారు నాయకులు.అందుకే దీనికి పోటీ కూడా అదే స్థాయిలో తీవ్రంగా ఉంటుంది.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీట్లు దక్కని చాలామంది కి జగన్ నామినేటెడ్ పదవులు ఆశచూపి అప్పట్లో బుజ్జగించారు.ఈ నేపథ్యంలో చాలా మంది టిటిడి బోర్డు మెంబెర్ పదవి తమకు దక్కుతుందనే ఆశలు పెట్టుకున్నారు.కానీ ఆశించిన స్థాయిలో నాయకులకు ఇందులో చోటు దక్కకపోవడంతో వారంతా జగన్ తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.కనీసం ఏపీ లో ఉన్న 13 జిల్లాల్లో జిల్లాకు ఒకరి చొప్పున స్థానం కల్పిస్తే బాగుండేదని కానీ జగన్ అలా చేయలేదని మండిపడుతున్నారు.
పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని కానీ పదవులు, ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి జగన్ సొంత పార్టీ నేతలకు అన్యాయం చేస్తున్నాడని నాయకులు మాట్లాడుకుంటున్నారు.ఇప్పటికే రాష్ట్రంలో అన్ని విషయాల్లో అధికారులకు ప్రమేయం కల్పిస్తూ నాయకులను పక్కనపెట్టేస్తున్నారని మండిపడుతున్నారు.