రాష్ట్ర స్థాయిలో సఖ్యత లేకపోయినా, జాతీయ స్థాయిలో వైసీపీ, బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత బాగానే ఉంది.ఏపీ సీఎం జగన్ తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థిస్తూ కేంద్ర బీజేపీ పెద్దలు మద్దతు ఇస్తూ వస్తున్నారు.
జగన్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి విషయంలోను స్పందిస్తున్నారు.ఇక ఏపీ బీజేపీ విషయానికి వస్తే ప్రతి సందర్భంలోనూ తప్పుబడుతూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తో కలిసి బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.
ఇలా రెండు రకాలుగా బీజేపీ వ్యవహరిస్తోంది.ఇక వైసీపీ కూడా అదే ఈ విధంగా రాష్ట్ర స్థాయి నాయకులను విమర్శిస్తూ కేంద్రానికి మద్దతు ఇస్తోంది.
తాజాగా నిన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా పథకం లో భాగంగా రైతులు అకౌంట్ లోకి డబ్బులు బదిలీ చేశారు.దీనిపై పెద్ద ఎత్తున పత్రికా ప్రకటనలు ఇచ్చారు.
కానీ ఆ ప్రకటనలో ఎక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో వాడలేదు.దీనిపై బీజేపీ ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కేవలం రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత నిధులతో ఈ పథకాన్ని అమలు చేసి ఉంటే ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు ఉండేవి కాదు.కానీ అసలు ఈ పథకం పేరు ” వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ యోజన “. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కేంద్రం వాటా ఈ పథకంలో ఉంది అనే విషయాన్ని బయట పెట్టలేదు.కేవలం జగన్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలు మాత్రమే పెట్టారు.
అయితే గతేడాది ఇదే పథకాన్ని అమలు చేసిన సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీ ఫోటోను పెట్టారు.మూడు విడతల్లో రైతులకు ఇస్తున్న 13,500 లలో 7500 మాత్రమే ఏపీ ప్రభుత్వం ఇస్తుంది.
మిగతా 6000 ను కేంద్రం ఇస్తోంది.
రైతు భరోసా పథకం కింద ఏపీ ప్రభుత్వం 6,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రకటిస్తున్నా, ఇందులో 40 శాతం కేంద్రం నుంచి వచ్చే నిధులు.పీఎం కిసాన్ పథకం కింద ఈ సొమ్మును కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.ఏపీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం 7500 ఉండగా, కేంద్రం ఇచ్చేది 6000 గా ఉంది.
కానీ ఏపీ ప్రభుత్వం మొత్తం సొమ్మంతా ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకోవడం పై బీజేపీ ఇప్పుడు మండిపడుతోంది.కనీసం కేంద్రం వాటా ఉంది అని చెప్పకుండా, ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలు కూడా ఎక్కడా వాడకుండా మొత్తం సొమ్ము ఏపీ ప్రభుత్వ ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడం పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఈ విషయంపై కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లి వైసీపీ పై ఫిర్యాదు చేసి, ఈ వ్యవహారంపై వైసీపీ స్పందన తెలుసుకునేందుకు ఏపీ బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.ఈ వ్యవహారంపై నోరు మెదిపేందుకు వైసీపీ నాయకులు ఎవరు ఇష్టపడడం లేదు.