తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఇద్దరు మంచి మిత్రులు అన్న సంగతి తెలిసిందే.రాష్ట్ర విభజన సమస్యలు, సాగునీటి వివాదాలు ఇలా ఎంత పెద్ద సమస్య వచ్చినా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటూ, వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు కెసిఆర్ తెర వెనుక ఎంతో కృషి చేశారనే సంగతి తెలిసిందే.
తమ ఉమ్మడి శత్రువైన చంద్రబాబును రాజకీయంగా పతనం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ జగన్ ఇద్దరూ ముందుకు వెళ్తున్నారు.తాజాగా కెసిఆర్ చేసిన ఒక సహాయం పై టిడిపి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉండడంతోపాటు, వైసీపీకి మంచి మైలేజ్ రావడంతో వైసీపీ శ్రేణులు అంతా కెసిఆర్ ను ప్రశంసిస్తున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.? కొద్ది రోజుల క్రితం హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్యంగా భేటీ అయిన దృశ్యాలు మీడియాలో వచ్చాయి.ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీలోనూ ప్రకంపనలు సృష్టించాయి.ఎప్పటి నుంచో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు కు సన్నిహితంగా మెలుగుతున్నారు అని, ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని పదేపదే వైసీపీ ఆరోపణలు చేస్తూనే వస్తోంది.నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎన్నికల అధికారి గా ఉండేందుకు అర్హుడు కాదని, ప్రత్యేకంగా ఒక ఆర్డినెన్స్ ను తీసుకువచ్చి ఆయనను తొలగించి కొత్త ఈసీని గవర్నర్ ద్వారా నియమించుకున్నారు.
ఈ వ్యవహారం పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీం కోర్టుకు వెళ్లడం, ప్రస్తుతం అక్కడ కేసు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంలో వైసీపీ పై ప్రజల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి.
రమేష్ కుమార్ ను వైసీపీ కావాలనే ఇబ్బందులు పెడుతోంది అనే విషయాన్నితెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది.ఇది ఇలా ఉంటే ఇప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే సుజనా చౌదరి, కొమ్మినేని శ్రీనివాసరావు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్యంగా భేటీ అవ్వడం ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.ఈ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా పార్క్ హయత్ హోటల్ లో ని సీసీ టీవీ ఫుటేజ్ లు ఇప్పించే వ్యవహారంలో సహాయం చేసినట్లు తెలుస్తోంది.ఇప్పుడు ఆ వీడియో సాక్ష్యాల ఆధారంగా సుప్రీంకోర్టుకు ఆ వీడియోలను సమర్పించాలని వైసిపి భావిస్తోంది.