రాజకీయాల్లో స్నేహం అయినా, ప్రాధాన్యతలు అయినా, పొత్తులు అయినా, ఏదైనా అవసరాల మేరకే ఉంటాయి.ఒకరికి ఒకరు అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఇందులో మిత్రులుగా కొనసాగుతారు.
అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే వ్యాక్యం పుట్టుకొచ్చింది.ఇదిలా ఉంటే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర అధికార పార్టీ బీజేపీల మధ్య స్నేహం ఉందా ? లేక శత్రుత్వం ఉందా అనే విషయం ఒక పట్టాన ఎవరికీ క్లారిటీ దొరకడం లేదు.అసలు ఈ రెండు పార్టీల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.2019 ఎన్నికలకు ముందు టీడీపీపై ఉన్న కోపంతో కేంద్ర బీజేపీ పెద్దలు జగన్ కు అన్ని విధాలుగానూ సహకరించారు.ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు గట్టిగానే ప్రయత్నించారు.
రాజకీయంగాను, ఆర్ధికంగాను, అండదండలు పుష్కలంగా జగన్ కు అప్పట్లో అందాయనే ప్రచారం జరిగింది.
కేంద్రంలో జగన్ సఖ్యతతో మెలుగుతూ వస్తున్నారు.కేంద్ర బీజేపీ పెద్దలు జగన్ విషయంలో సానుకూలంగా వస్తున్నారు.
కానీ ఏపీలో వైసీపీ ని రాజకీయ శత్రువుగా చూస్తూ, బీజేపీ నాయకులు వ్యవహరిస్తూ వచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ కు అనుకూలంగానే వ్యవహరించారు.
కొద్దిరోజులుగా అంతర్వేది వ్యవహారం రాజుకోవడంతో టిడిపి కంటే వైసీపీనే ఏపీ బీజేపీ బద్ద శత్రువుగా చూస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ఏపీలో పరిస్థితి ఎలా ఉన్నా, జగన్ మాత్రం కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు.
రాజ్యసభలోనూ ఓటింగ్ సందర్భంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.కానీ కొద్ది రోజులుగా బీజేపీ కేంద్ర పెద్దలు జగన్ ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.ఏపీకి నిధులు ఇచ్చే విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు.ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో పెద్ద ఎత్తున నిధులు రావాల్సి ఉండడంతో, కేంద్రానికి లేఖ రాసినా, అందులో కొంతమేర మాత్రమే చెల్లింపులు చేశారు.
త్వరలోనే విడుదల చేస్తామని చెబుతూ వాయిదా వేస్తూ వస్తున్నారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ ఇదే విధంగా వ్యవహరిస్తోంది.
తమకు ప్రధాన రాజకీయ శత్రువుగా ఉన్న టీడీపీ ఈ విషయంలో తమకు సహకరించాలని, టీడీపీ నాయకుల అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ చేయించాలని కేంద్రాన్ని కోరుతూ వస్తున్నా, అటువైపు నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు.దీంతో వైసీపీ ఎంపీలు పార్లమెంట్ వద్ద ధర్నా చేసే వరకు పరిస్థితి వచ్చి పడింది.
ఇలా చెప్పుకుంటూ వెళితే ఏ విషయంలోనూ జగన్ మాట నెగ్గకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో వైసీపీ శ్రేణులు ఆగ్రహంగానే ఉన్నారు.బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు.
అలాగే రానున్న రోజుల్లో వైసీపీ మద్దతు బీజేపీకి చాలా అవసరం.ఆ పార్టీ రాజ్యసభ స్థానాలు ఎక్కువగా ఉండడంతో, కీలక బిల్లులను ఆమోదించుకోవాలన్నా, జగన్ మద్దతు తప్పనిసరి.
అయినా జగన్ విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు ఏ క్లారిటీ లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు.జగన్ కోరినట్లుగా నిధులు ప్రకటించి, ఆయనకు అన్ని రకాలుగా అభివృద్ధి విషయంలో సహకరిస్తే ఏపీలో బీజేపీ ఎదిగేందుకు అవకాశం ఉండదని, జగన్ మరింత శక్తిమంతుడు అవుతాడనే అభిప్రాయంతో జగన్ కు ఈ విధంగా ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కానీ ప్రజాకర్షణ ఉండి, అన్ని విషయాల్లోనూ తెగువ చూపించే జగన్ వంటి వ్యక్తులను దూరం చేసుకునే కంటే, సఖ్యత గా ఉంటేనే బీజేపీకి భవిష్యత్తులోనూ మేలు జరుగుతుంది.దీనికి తోడు జగన్ మిత్రుడైన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు తహతహలాడుతున్నారు.
మరి కొద్ది నెలల్లో సొంత పార్టీని స్థాపించి, కేంద్రంలో చక్రం తిప్పేందుకు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈ పరిస్థితుల్లో జగన్ వంటి బలవంతులను దూరం చేసుకోవడం బీజేపీ వ్యూహాత్మకంగా చేస్తున్న తప్పిదమే అనేది విశ్లేషకుల అభిప్రాయం.